గోదావరికి వరద (Godavari River Flood) ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. రికార్డుస్థాయిలో వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఆరు జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా కోనసీమలోని లంకగ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రశాంతంగా ఉండే గోదారి ఉగ్రరూపం దాల్చడంతో కట్టుబట్టలతో గ్రామలను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. గోదావరి తీరంలో ఎటు చూసినా వరదనీరే దర్శనమిస్తోంది. వందేళ్లలో ఎనాడూ చూడని వరదను గోదావరి జిల్లాల ప్రజలు చూస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.80 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాల్వలకు 10వేల క్యూసెక్కులు, దిగువకు 23.90 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ వరద మొత్తం 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ సంబంధిత అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మునుపెన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో వరద సంభవించింది. వరదల ధాటికి దేవీపట్నం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, వీఆర్ పురం, పోలవరం, ఏటపాక మండలాలతో పాటు దిగువన పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం,అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలు, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి లో 4 మండలాలు, ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉంది. వరద సహాయక చర్యలపై అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందుతున్నాయి.
వరద సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. మరో 177 గ్రామలను వరదలు ముంచెత్తే అవకాశముంది. ఇప్పటివరకు 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టుల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అటు యానాంలో గౌతమి గోదావరి వరద ఉధృత రూపం దాల్చింది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీరు యానాం పరిపాలనాధికారి కార్యాలయాన్ని సమీపించింది. మట్టాగార్డెన్ వద్ద గోదావరి వరద పరిరక్షణ కట్టుకు గండి పడటంతో గ్రామాల్లోకి వరద నీరు చోచ్చుకొస్తుంది. దీంతో మట్ట గార్డెన్, అయ్యన్న నగర్, రాధనగర్ తదితరు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. అలాగే దరియలతిప్ప రోడ్డుకు సమాంతరంగా చేరుకున్న వరద నీరు చేరడంతో అడ్డుకట్ట వేసేందుకు ఇసుక బస్తాలు వేస్తున్నారు.
ఇప్పటికే వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన సాయం అందించాలన్నారు. నిత్యావసరాలతో పాటు నగదు సాయం చేయాలని సూచించారు. వరదలపై ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, Godavari river