(Ramesh, News18, East Godavari)
ప్రస్తుత కాలంలో జీవన విధానంలో మార్పుల ప్రభావమో, పని ఒత్తిడో తెలీదు కానీ, ఈ కాలంలో రోగుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల లెక్కైతే చెప్పలేనంతలా ఉంది . ఆసుపత్రులు ఖాళీ ఉండటం లేదు. రోగాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రోగాల పేర్లు చెబితే భయపడాల్సి వస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాధుల భారీన పడుతన్నారు. నిత్యం మందుల దుకాణాల దగ్గర నుండి, చిన్నపాటి పీఎమ్పీ ఆసుపత్రులు కూడా ఖాళీ లేవంటే రోగ పీడుతులు ఏ లెక్కన ఉన్నారో తెలుస్తోంది.
ప్రస్తుతం సమాజంలో ఆస్తుల కంటే రోగాలు ఎక్కువగా ఉన్నావారు పెరిగిపోతున్నారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతున్నప్పటికీ బతుకు పోరాటంలో ఈ రోగాల బాధలు మాత్రం తప్పడం లేదు. ఏపీలో ఎక్కడికక్కడ రోగుల సంఖ్య లెక్కలు తేలుస్తున్నారు. ఇందులో భాగాంగా బిపి, సుగర్, క్యాన్సర్ నివారణ జాతీయ కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాలో 75.62 శాతం సర్వే ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి..రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కాకినాడ జిల్లా పరిస్థితిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా.. అసిస్టెంట్ కలెక్టరు ప్రఖర్ జైన్ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి స్కిల్ హబ్బ్ లు, నైపుణ్య కళాశాలలు, నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాలు; గ్రామ/వార్డు సచివాలయాల్లో స్పందన, గడప గడపకు మన ప్రభుత్వం అర్జీలు పరిష్కారం; వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి, వైద్య శాఖలో ఖాళీలు భర్తీ, ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్; నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ (ఎన్.సీ.డీ) సర్వే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల కల్పన ఇతర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టరు కృతికా శుక్లా జిల్లాలో నిర్వహించిన జాతీయ ఆరోగ్య సర్వే వివరాలను, ప్రగతిని ప్రజెంటేషన్ ద్వారా సిఎస్ కు వివరించారు.
ఎఎన్ఎం లు నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా హెల్త్ యాప్ సహకారంతో సర్వే చేపట్టామన్నారు కలెక్టర్. ఇందులో 15,42,517 మందికి హెల్త్ ఐడి నెంబర్లు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో 30 సంవత్సరాలు పైబడి బిపి, షుగర్, కాన్సర్ రిస్క్ గ్రూపులో 12,47,015 మంది ప్రజలు ఉండగా వీరిలో 9,44,552 మంది సర్వే పూర్తయిందని వెల్లడించారు కలెక్టర్ కృతికా శుక్లా. ఇప్పటి వరకూ నిర్వహించిన సర్వేలో 10.43 శాతం మంది బి.పి.6.76 శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వ్యాధి నిర్థారణ అయిన వ్యక్తులకు ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా పరీక్షలు, చికిత్స నిర్వహిస్తున్నామని సీఎస్కు వివరించారు. ఇప్పటి వరకూ 50.2 శాతం మందికి బిపి పరీక్షలు, 57.55 శాతం మందికి షుగర్ పరీక్షలు పూర్తియి చికిత్స అందించడం జరుగుతోందని స్పష్టం చేశారు.
మొబైల్ నెంబర్లు ఆధార్ నెంబరుతో అనుసంధానం కాకపోవడం, కొంత మంది వృద్దులకు బయోమెట్రిక్ గుర్తింపు సాధ్యకాకపోవడం, అర్బన్ ప్రాంతాల్లో ఎఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల సర్వే జాప్యం జరుగుతుందని సిఎస్ జవహర్రెడ్డి దృష్టికి తెచ్చారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని 40 గ్రామాల్లో నెట్ వర్క్ సమస్య ఎదురైందని, అలాగే ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ప్రజల సర్వే పెండింగ్ ఉందన్నారు. సర్వేలో ఎదులౌతున్న సమస్యలను అధిగమించేందుకు బయెమెట్రిక్స్ తో పాటు ఐరిస్ ఐడెంటిఫికేషన్ అనుమతించాలని, నెట్ వర్క్ లేని చోట్ల ఆఫ్ లైన్ సర్వే అనుతించాలని, అర్బన్ ప్రాంతాల్లో ఎఎన్ఎంల కొరత దృష్ట్యా వారికి మల్టిపుల్ లాగిన్ కల్పించాలని కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శని కోరారు. మొత్తం మీద జిల్లా కలెక్టర్ బీపీ, షుగర్, క్యాన్సర్ రోగుల లెక్కలను తేల్చారు. అలాగే గర్భీణీలకు సంబంధించి సేవలను, ఆసుపత్రుల అభివృద్ధి పనులు, పిహెచ్సీ, సిహెచ్సీల్లో లోపాలను సిఎస్కు దృష్టికి తీసుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News