Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వరుస ప్రమాదాలు భయ పెడుతున్నాయి. మనుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని పరిశ్రమలు మృత్యు కేంద్రాలుగా మారి మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. ఇటీవల ఫ్యాక్టరీల ద్వారా జరుగుతున్న ప్రమాదాలు, మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) దేవరపల్లి మండలం గౌరీపట్నం దగ్గర కెమికల్ ఫ్యాక్టరీ (Chemical Factory) లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
విజన్ డ్రగ్స్ పరిశ్రమలో ఇథైల్ కాలమ్ గొట్టంలో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కెమికల్ ట్యాంకర్ పేలింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో నెల రోజుల వ్యవధిలోనే ఇలా తరచూ ఇలా ప్రమాదం జరగడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో ఫ్యాక్టరీలకు వెళ్లాలి అంటేనే భయం భయం ఉంటోంది అంటున్నారు కార్మికులు.
తాజా ప్రమాదంలో చాగల్లుకు చెందిన మహీధర్ ముసలయ్య, తాజ్యంపూడి వాసి రత్నబాబు, గౌరీపట్నంకు చెందిన సత్యనారాయణ అనే ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. వారిని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం తరువాత మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించారు.
ఘటనా స్థలిని అధికారులతో పాటు పోలీసులు పరిశీలించి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఇంఛార్జి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరిశ్రమను సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితుల కుటుంబాలను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి : ఎత్తు మూడు అడుగులే కాని.. కాసుల వర్షం కురిపిస్తాయి.. ప్రత్యేకత ఏంటంటే..?
మరోవైపు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇటీవల గోదావరి జిల్లాలలో వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. నెల రోజుల క్రితం కాకినాడలోని ఓ షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు మరణించారు. నాలుగు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Breaking news, East godavari, Fire Accident