Cock Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెద్ద పండుగా అంటే సంక్రాంతే.. అయితే సంక్రాంతి (Sankrathi) అంటే కేవలం సంప్రదాయ పండుగ మాత్రమే కాదు.. కోడి పందేలకు (Cockfight) కూడా పెట్టింది పేరు. కత్తులతో కుత్తుకలు తెగే పుంజుల పోరాటాన్ని రక్తికట్టించేందుకు నిర్వాహకులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి విభిన్నంగా క్రాస్డ్ జనరేషన్ పుంజులను (Crossed Genaration Cocks) బరిలోకి దించుతున్నారు. దీంతో ఈ సారి పోటీలు మరింత రంజుంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంతో పోలీస్తే ఈ సారి ఆ సందడి ఎక్కువగానే కనిపిస్తోంది. కరోనా భయాలు లేకపోవడంతో భారీగా జనం పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు.
గతేడాది జనవరిలో కోడిపందేల రూపంలో రాష్ట్రవ్యాప్తంగా 900 కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ఓ అంచనా. ఇందులో కోడిపందేలకు పెట్టింది పేరైన ఉమ్మడి పశ్చిమ గోదావరి , తూర్పు గోదావరి జిల్లాల వాటా అత్యధికంగా 500 కోట్ల రూపాయలు ఉండొచ్చు.
నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో గతంలో పందేల జోరు తగ్గినా.. ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఇంకా ఎక్కువగా పందేలు ఉంటాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, ఏలూరు , తూర్పు గోదావరి, గుంటూరు , కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కోడిపందేల నిర్వాహకులు పందెపు బరులను సిద్ధంచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో లాడ్జిలు, అతిథి గృహాలు బుక్కయిపోయాయి.
ఇదీ చదవండి : ఆయన దారి టీడీపీ వైపు కాదా..? జనసేనలో చేరాలని ఫిక్స్ అయ్యారా..? కన్నా ఫ్యూచర్ ఏంటి..?
ఈ ఏడాది కోడిపందేలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. క్రాస్ జనరేషన్ కోడిపుంజుల హవా కొనసాగుతోంది. అమెరికన్ గేమ్ పాల్, అమెరికన్ పెర్విన్, బ్రెజిల్ జాతి కోళ్లను తీసుకొచ్చి దేశీయ నెమలి, డేగ వంటి జాతి కోళ్లతో క్రాసింగ్ చేయిస్తున్నారు. పందేనికి సిద్ధమైన వీటి ధర లక్ష రూపాయల పైమాటగానే ఉంది. ఇక కోడిపుంజుల పెంపకాన్ని పలు జిల్లాల్లో నిర్వాహకులు కుటీర పరిశ్రమగా మార్చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 300 కోడిపుంజుల శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
18 నెలల పాటు పుంజులను పోటీలకు సిద్ధంచేయడానికి ఒక్కో శిక్షకుడికి 15 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. యంత్రాలలో కోడిగుడ్లను పొదిగించి నాణ్యమైన పుంజు జాతులను తయారుచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలను అడ్డుకోవడానికి గతంలో పోలీసులతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. పోలీసు యాక్ట్ 144 సెక్షన్ను విధించారు. బైండోవర్లు చేసి, వేలాదిగా కోడి కత్తులను సీజ్ చేశారు. ఈ ఏడాది కూడా భారీగా కోడికత్తులను సీజ్ చేశారు.
ఇదీ చదవండి: పొత్తులే లక్ష్యంగా మరో అడుగు.. ఇద్దరి టార్గెట్ వైసీపీ ఓటమే.. ఇదీ అసలు మ్యాటర్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 1000 కేసులు నమోదు అయ్యాయి అంటున్నారు పోలీసులు. అయితే కోడి పందాల నుంచి యువతలో మార్పు తీసుకురావడం కోసం.. పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను మార్పు కోసం నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు, జూదాలను కట్టడి చేయడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశామన్నారు.
నూతన ఏలూరు జిల్లాలో పరిస్థితి మరింత అధికంగా కనిపిస్తోంది. 15 రోజుల్లోనే 45 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే పెట్రోలింగ్ టీంలు పనిచేస్తున్నాయని.. ముఖ్యంగా జూదాల వైపు దృష్టి మళ్లకుండా పోలీస్స్టేషన్ల పరిధిలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను పోలీసు శాఖ ఏర్పాటుచేసింది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా..? కోడిపందాలకు మాత్రం అడ్డుకట్ట పడేట్టు కనిపించడం లేదు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cock fight, Makar Sankranti