P Ramesh, News18, Kakinada
చదువులతో పాటు ఆటలు కీలకం. ఒకప్పుడు ఆడపిల్లలు ఆటల్లో రాణంచాలంటే దానికొక పెద్ద తతంగమే ఉండేది. ఇళ్లల్లో అనుమతులు ఇచ్చేవారు కాదు. పెద్దలు ఏమనుకుంటారోననే భయం. కానీ లోకం మారింది. రోజులు మారాయి. పతకాలు ఎగరేసుకుపోతున్నారు. ఒక్కటి కాదు రెండు కాదు. సకల కళల్లో రాణిస్తున్నారు అమ్మాయిలు. ప్రస్తుతం ఏపీలో పలు జిల్లాలో ఆటల పోటీలు కేవలం అమ్మాయిలకే నిర్వహిస్తున్నారంటే ఆ ఘనత చెప్పకనేచెప్పవచ్చు. హ్యాండ్ బాల్, వాలీబాల్, వీటితోపాటు రెజ్లింగ్, రగ్బీ ఇలా చెప్పుకుంటూ పోతే కరాటే, కుంగ్ ఫూతో పాటు విలు విద్యలలో అమ్మాయిలు పతకాల పంట పండిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా తూర్పుగోదావరిలో పాఠశాలల నుండి, కళాశాల స్థాయి వరకూ అమ్మాయిలు ఓ రేంజ్లో పతకాలు సాధిస్తున్నారు.
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన 66వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు ముగిశాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల నుంచి దాదాపు 350 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. 14 , 17, 19 ఏళ్ల వయసు వారితో మూడు విభాగాలలో పోటీలు జరిగాయి. పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టి.కె.విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
విజేతలు వీరే..
అండర్ 19 మహిళా విభాగంలో గోల్డ్ మెడల్ కావ్య (కృష్ణా జిల్లా), సిల్వర్ మెడల్ షేక్ షమీమా (గుంటూరు), బ్రాంజ్ మెడల్ ఎన్.కీర్తి నాయుడు (గుంటూరు) గెలుచుకున్నారు. అండర్ 14 బాలికల విభాగంలో గోల్డ్ మెడల్ ఎన్.లీలా అన్విత (వైజాగ్), సిల్వర్ మెడల్ వి.లోకజ్ఞ(తూర్పు గోదావరి జిల్లా),బ్రాంజ్ మెడల్ ఎన్. మహిమా వర్మ గెలుచుకున్నారు. పిస్టల్ అండర్ 14 బాలుర విభాగంలో గోల్డ్ మెడల్ టి.చరణ్ జిత్ (వైజాగ్), సిల్వర్ మెడల్ ఎన్.దీపక్(వైజాగ్), బ్రాంజ్ మెడల్ షేక్ మహ్మద్ సాదిక్ (గుంటూరు) గెలుపొందారు.అండర్ 19 విభాగంలో గోల్డ్ మెడల్ ఎం.గోపిక(కృష్ణా జిల్లా), సిల్వర్ మెడల్ బి.రిషిత(కృష్ణా జిల్లా), బ్రాంజ్ మెడల్ షేక్ సల్మా (కృష్ణా జిల్లా) గెల్చుకున్నారు.ఈసారి జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.రాష్ట్ర పోటీల్లో విజేతలకు అభినందనలు తెలిపారు.
ఉద్యోగాల్లో అవకాశాలు
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకొదగ్గ విషయం ఏమిటంటే ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు సాధిస్తున్న పతకాలు ద్వారా , పొందుతున్న సర్టిఫికెట్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా కింద మెడిసన్ సీట్లు, ఇతర ఇంజనీరింగ్ సీట్లతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో చదువులతో సమానంగా ఆటలు చేర్చారు. స్పోర్ట్స్ విభాగంలో చాలా వరకూ క్రీడలను ఇటీవల కాలంలో చేర్చారు. అథ్లెట్స్ తోపాటు, క్రీడా విభాగంలో రగ్బీ, అర్చరీ, హ్యాండ్బాల్ క్రీడలకు ప్రాధాన్యత ఉంది. బాస్కెట్బాల్, షటిల్ విభాగాల్లో కూడా ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నరు. ఒక పక్క ఆరోగ్యంతోపాటు, మంచి ఉద్యోగాలు , ఉన్నత చదువులకు స్పోర్ట్స్ కోటాలో ఉపయోగించుకోవడంలో ఆటల ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు క్రీడా ఉపాధ్యాయులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News, Rajahmundry, Shooting