(Ramesh, News18, East Godavari)
కొన్ని సేవలు జీవిత కాలం పాటు ఉంటాయి. గతంలో ఒకప్పుడు సేవగుణాలకు ఇప్పుడున్న సేవలకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు వందల ఎకరాలు, సొంత భూములు దానం చేసేవారు. ఇప్పుడేమో ఉన్న భూములను కాజేస్తున్నారు. అందుకే పాతతరమే గొప్ప అంటారు. గతంలో మన పెద్దల కోసం బాగా చెప్పుకుంటుంటారు. అలాంటి స్మృతుల్లో ఒకటైన కాకినాడ జిల్లా తునిలో ఓ ఆసుపత్రిని నిర్మించిన దాతలను స్మరించుకున్నారు. సరిగ్గా వందేళ్ల సేవలకు ఆ ఆసుపత్రి నిదర్శనంగా నిలుస్తోంది.
కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో సేవలకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. వందేళ్లలో లక్షలాది మందికి సేవలు అందించి ఎందరో ప్రాణాలు కాపాడిన ఆసుపత్రిగా గుర్తింపు సాధించిందని ఆయన ఆసుపత్రి సేవలను కొనియాడారు. ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎస్. స్వప్న అధ్యక్షతన శతజయంతి వేడుకలు నిర్వహించారు.
ముఖ్య అథితులుగా మంత్రి దాడిశెట్టి రాజా, కలెక్టర్ కృత్తికా శుక్ల హాజరయ్యారు. మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఒత్తిడి సమయంలోనూ ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు. ఆసుపత్రి నిత్యం రద్దీగా ఉంటుందని తెలిపారు. వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన ఎస్.ఆర్.వి.వి.సుభద్రయమ్మ బహదూర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ముందు చూపుతో ఈ ఆసుపత్రి ఏర్పాటుకు వారు ఎంతో కృషి చేశారన్నారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రి మంచి సేవలు అందించి వేలాది మంది ప్రాణాలను నిలిపిందని పేర్కొన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రులకు దీటుగా తుని ఏరియా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ 1922 నుంచి నిరాటంకంగా సేవలు అందిస్తున్న ఎస్ ఆర్ వి వి సుభద్రయమ్మ బహదూర్ ప్రాంతీయ ఆసుపత్రి శత వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తుని ఆసుపత్రికి భూములు ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేసి, ఘనంగా సత్కరించారు.
ఆనాడు బహుదూర్ సేవలను స్మరించుకున్నారు. అప్పటి సేవలను కొనియాడారు. ప్రస్తుతం అధిక నిధులను వెచ్చించి ఆసుపత్రి సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జిజిహెచ్ స్థాయికి ఆసపత్రిని తీసుకెళ్లడం ద్వారా ప్రజలు కాకినాడ రాజమహేంద్రవరం వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రూ.10.5 కోట్లతో నాడు నేడు కింద పనులను ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. మెరుగైన సేవలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆసుపత్రిలో కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News