Bunny Utsav At Devaragattu 2021: కర్నూలు జిల్లా (kurnool District)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కర్రల సమరానికి దేవరగట్టు (Devaragattu)సిద్ధమైంది. కర్రలతో కొట్టుకునేందుకు 11గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. తేదీ శుక్రవారం రాత్రి 12 గంటలకు మాలమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. ఆ తరువాత కర్రల యుద్ధం ప్రారంభమవుతుంది. తెల్లవారు జామున 4 గంటల వరకు పోరు కొనసాగుతుంది. విజయదశమి (Vijayadasami) పర్వదినాన.. కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో మాల మల్లేశ్వరస్వామి కొలువైన దేవరగట్టులో బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. దేవరగట్టులో దశమి రోజున మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. కళ్యాణోత్సవం తరువాత స్వామి వారిని ఊరేగిస్తారు. ఉత్సవ మూర్తులను మేళతాళాలతో కొండ దిగువన సింహాసన కట్టకు చేరుస్తారు. అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. ఆచారంలో భాగంగా.. ఉత్సవమూర్తులను తమ వశం చేసుకునేందుకు కర్రల యుద్ధానికి సిద్ధమవుతారు.
మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు పోటీ పడుతూ రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది.. అయితే ఈసారి కర్నూలు దేవరగట్టు కర్రల సమరంపై కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.. అగ్గి దివిటీలు, ఐరన్ రింగులు తొడిగిన కర్రలు తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశారు. బన్నీ ఉత్సవాలకు బంధువులను పిలవొద్దని.. కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.. వాహనాలను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు పోలీసులు.. దేవరగట్టు చుట్టూ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.. ఇప్పటికే 360 ఐరన్ రింగులు తొడిగిన కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఉత్సవాల్లో అల్లర్లకు పాల్పడతారని అనుమానిస్తున్న 160 మందిని మూడు రోజుల కిందటే అదుపులోకి తీసుకొని.. కోర్టు ముందు హాజరుపరిచారు.. ఇక ముందు జాగ్రత్తగా దేవరగట్టులో 20 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దేవరగట్టులో జరిగేది కర్రల సమరం కాదు సంప్రదాయం మాత్రమేనన్నారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. ప్రాచీన కాలంలో కరెంటు లేకపోవడంతో క్రూరమృగాలు, జంతువుల నుంచి తమ రక్షణ కోసం అగ్గి దివిటీలు, ఐరన్ రింగులు తొడిగిన కర్రలు తీసుకొని వెళ్లే వారని తెలిపారు. ప్రస్తుతం కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందన్నారాయన. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికార యంత్రాంగం, పోలీసులు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులంతా సమన్వయంతో ప్రత్యేకంగా చర్యలు చేపట్టారని వెల్లడించారు మంత్రి గుమ్మనూరు జయరాం.
ఇదీ చదవండి: కుబేరుడు మీ ఇంట్లోకి రావాలి అనుకుంటున్నారా..? దసరా రోజున ఇలా పూజిస్తే శుభం కలుగుతుంది..
ఈ ఉత్సవంలో భాగంగా ఎవరు ఎదురుపడితే వారిని కర్రలతో కొడుతూ ముందుకు దూసుకెళుతారు. కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఈ ఏడాది కూడా అరికట్టాలని ప్రభుత్వం, పోలీసులు నిర్ణయించి, పటిష్టమైన బందోబస్తును కల్పించారు. గతంలో కర్రలయుద్ధంలో తీవ్రంగా గాయపడి చనిపోయినవారు కూడా ఉన్నారు. అయినా ఇక్కడ ప్రజలు మాత్రం ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా కర్రల యుద్ధానికి సిద్ధమవుతున్నారు.
దీనికి తోడు కరోనా ఆంక్షలు ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు.. దేవరగట్టులో తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వేడుక ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజల్ని కోరుతున్నారు. నిబంధల్ని ఉల్లంఘిస్తే... కఠిన చర్యలు తీసుకొని కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Dussehra 2021, Kurnool