DOLI ISSUES IN ANDHRA PRADESH ONE PREGNANT LADY CARRY ON MORE THAN 12 KILO METERS IN VIZIANAGARAM NGS VZM
Doli Tension: 12 కిలోమీటర్లు డోలీలోనే గర్భిణి నరకయాతన.. ఎన్నాళ్లీ కష్టాలు
ఎన్నాళ్లీ డోలీ కష్టాలు
Doli Tension: ఎన్నాళ్లీ డోలీ కష్టాలు అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ నిండు గర్భిణిని 12 కిలోమీటర్ల దూరం మోయాల్సి వచ్చింది. దీంతో గర్భిణితో పాటు ఆమెను మోసిన గిరిజనలు సైతం నరకయాతన అనుభవించాల్సి వచ్చింది.
Doli Tension: తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటున్నారు ఏజెన్సీ ప్రజలు.. ప్రభుత్వలు మారుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు.. కానీ ఇచ్చిన హామీలు మాత్రం ముందుకు కదలక.. నరక యాతన అనుభవిస్తున్నామంటున్నారు. తాజాగా విజయనరం జిల్లా(Vizianagaram District)లోని ఏజెన్సీలో జరిగిన ఘటన చూస్తే.. అయ్యో అనక తప్పదు.. అసలే నెలలు నిండిన గర్భిణి (Pregnant).. ఆపై పురిటి నొప్పులు.. సకాలంలో ఆసుపత్రి (Hospital)కి వెళ్లకపోతే.. ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో సుమారు 12 కిలోమీటర్ల పాటు డోలీలోనే మోసుకుంటూ, ఆ రాళ్లు రప్పల మధ్యే నడుచుకుంటూ.. ఆసుపత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు గిరిజనులు. ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ చిట్టెంపాడుకు చెందిన గర్భిణి మజ్జి గంగమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం ఎదుర్కొన్న కష్టమిది.
పురిటి నొప్పులతో నరకయాతన పడుతున్న ఆమె బాధను చూసిన కుటుంబ సభ్యులు.. కాళ్ల కింద రాళ్లు పడినప్పుడల్లా అమ్మా! అనుకుంటూనే, ఇబ్బందులు పడుతూనే.. ఆమెను 12 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుంటూ తరలించారు. శనివారం అర్ధరాత్రి నుండే.. నొప్పులు మొదలయ్యాయి. రాత్రి సమయంలో కొండపై నుంచి కిందకు తీసుకువచ్చేందుకు వీలు లేకపోకపోవడంతో.. తెల్లవారు జామునే ఆమె భర్త రాము, కుటుంబ సభ్యులు డోలీ కట్టారు. గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడు నుండి కొండ దిగువ 12 కి.మీ దూరంలో ఉన్న మెట్టపాలెం వరకు, కొండల్లో చలికి వణుకుతూ, రాళ్లు రప్పల మధ్యే అతికష్టం మీద నడుచుకుంటూ గర్భిణీ మహిళను మోసుకుంటూ మెట్టపాలెం వద్ద ప్రధాన రహదారి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చేర్పించిన కాసేపటికే.. గంగమ్మ ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే గిరిశిఖర గ్రామాల్లో ఏదో ఒక చోట రోజూ ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయి. అత్యవసర పరిస్థితులలో ఒక్కోసారి ప్రాణాలపై ఆశలు వదులుకునే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ఒడిలో మమేకమై.. అడవి తల్లితో అనుబంధం పెనవేసుకుని జీవిస్తారు. కల్మషం లేని మనస్తత్వంతో.. నిండైన అమాయకత్వంతో బతుకీడుస్తారు.. అలాంటి వారి బతుకుల్లో మాత్రం వెలుగులు కరువయ్యాయి. దశబ్దాలు గడిచినా, పాలకులు మారుతున్నా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. డోలీ మోతలు మోస్తునే ఉన్నారు.
గతంలో వారం రోజుల్లో రోడ్డు వేస్తామని చెప్పిన ఎమ్మెల్సీ.. ఇంతవరకు రోడ్డులను మొదలు పెట్టలేదన్నారు. ఇప్పటికైనా కొండప్రాంత గ్రామాలకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే, బొడ్డవర పంచాయితీలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్సీ .. వారం రోజుల్లో రోడ్డు వేస్తామని చెప్పారని, ఆ మాటలు గాలిలో కలిసిపోయాయంటూ గిరిజనులు మండిపడుతున్నారు. దశాబ్ధాలుగా తమ గ్రామాలకు రహదారి వేయకపోవడమంటే.. తమను చిన్న చూపు చూడడమే నంటూ మండిపడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.