news18-telugu
Updated: July 10, 2020, 2:32 PM IST
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(File)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల సంఖ్య పెంచాలనే యోచన కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. విజయనగరం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం లాంటి జిల్లాలను విభజించి పెంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అనంతపురం, చిత్తూరు, గోదావరి లాంటి పెద్ద జిల్లాలను విభజించినా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా అనడంలో న్యాయం లేదని అన్నారు.
2026లో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని... పార్లమెంట్ నియోజకవర్గాల హద్దులు మారిపోతాయని అన్నారు. అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలోనూ అతిగా చేసి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చి ప్రాముఖ్యత లేకుండా చేసేశారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా అంటే ఒక విలువ ఉండాలని అన్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని విభజిస్తే కృష్ణపట్నం పోర్టు, షార్, శ్రీసిటీ అన్నీ తిరుపతి పరిధిలోకి పోతాయని తెలిపారు. నెల్లూరు జిల్లా తన ప్రాముఖ్యతను కోల్పోతుందని అన్నారు. ఏదో మేమనుకున్నది చేయాలనే ధోరణితో కాకుండా ప్రజలకు చిరస్థాయిగా ఉపయోగపడేలా, సౌకర్యవంతంగా జిల్లాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు సోమిరెడ్డి స్పష్టం చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
July 10, 2020, 2:32 PM IST