కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం నిలిపేసిన సంగతి తెలిసిందే. నేటికీ శ్రీవారి దర్శనానికి భక్తులు నోచుకోక దాదాపు 50 రోజులయ్యింది. తిరుమల పైకి భక్తులను అనుమతించకపోవడంతో టీటీడీకి సైతం ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇదిలావుంటే.. తాజాగా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించడంపై టీటీడీ కసరత్తు చేసింది. అందులో భాగంగా నిత్యం 14 గంటల పాటు భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ఒక్క గంటకు 500 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో రోజూకీ ఏడు వేల మంది మాత్రమే దర్శనానికి పరిమితం కానున్నారు.
అయితే మొదటి మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు అనుమతించేందుకు టీటీడీ యోచిస్తోంది. దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మాత్రమే భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఈ టికెట్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తారు.
ప్రయోగాత్మకంగా పరిశీలన పూర్తయిన తర్వాత అంచెల వారీగా చిత్తూరు జిల్లా వాసులు, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. ఇకపోతే వసతి సౌకర్యం కోసం ఇచ్చే గదులను ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలిపిరి, నడక మార్గంలోనే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేస్తారు. కరోనా వైరస్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత అందరినీ దర్శనానికి అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala news, Tirumala Temple, Ttd