Power Cut: వింటర్ లోనూ విద్యుత్ కోతలు (Power Cuts) వేడి పుట్టిస్తున్నాయి. నిమిషాల వ్యవధి కాదు.. గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరుసగా రెండు రోజుకూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ పరిస్థితి ప్రధాన కారణం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఎన్టీపీసీ (NTPC)కి రాష్ట్ర డిస్కంలు బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం కారణంగానే సరఫరా నిలిచిపోయి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ కోతలు మొదలయ్యాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు సుమారు 350 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. వీటికోసం ఎన్టీపీసీ వర్గాలు రెండు నెలలుగా డిస్కంలకు లేఖలు రాస్తున్నాయి. స్పందన లేకపోవడంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్ను నిలిపేసినట్లు సమాచారం. ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్లో కొనేందుకూ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్ చేశారు. అందుకే ఏపీలో డిస్కంలు రెండు రోజులుగా కోతలు విధించాయి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్ను డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు 350 కోట్లను డిస్కంలు బకాయి పడ్డాయి. కనీసంగా 30 కోట్ల రూపాయలు అయినా చెల్లించాలని అడిగినా, డిస్కంలు అదీ చెల్లించకపోవడం పరిస్తితి చేయి దాటింది. దీంతో వరుసగా రెండో రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా విద్యుత్ కోతలు తప్పలేదు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District)లో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో పలు ప్రాంతాల్లో అధికారులు కోతలు విధిస్తున్నారు. కాకినాడలో గత రెండు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచింది. కాకినాడ జీజీహెచ్ మినహా మిగతా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. అమలాపురం డివిజన్, తుని, సీతానగరంలో 2 గంటలుగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. వీటితోపాటు రామచంద్రాపురం డివిజన్లోనూ, తొండంగి, అనపర్తి, పెద్దాపురంలో సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : సమ్మెపై నేడు నిర్ణయం.. కొనసాగనున్నసహాయనిరాకరణ.. మధ్యాహ్నం సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ..?
శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram), ప్రకాశం (prakasam) సహా మరికొన్ని జిల్లాల్లోనూ పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చీరాలలో సాయంత్రం 6.30 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గింది. వీటీపీఎస్, ఆర్టీటీపీ, కృష్ణపట్నం కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు విద్యుత్ కేంద్రాల్లో కలిపి 1,700 మెగావాట్ల వరకు తగ్గింది. దీంతో మూడు డిస్కంలయ పరిధిలో విద్యుత్ కోతలను అధికారులు విధిస్తున్నారు.
తాజాపరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. విద్యుత్ లోటును ఆర్.టి.పి.పి ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మరో యూనిట్ను ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అందుకు సరిపడా బొగ్గు నిల్వలు లేవని ఆర్.టి.పి.పి స్పష్టం చేయడంతో... ఇందనశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు.
ప్రస్తుతం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. తరువాత ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.
ఇదీ చదవండి : ప్రధాని మోదీ మెచ్చిన తెలుగు వ్యక్తి.. అమృత్ పథకంలో కీలక బాధ్యతలు
సాంకేతిక లోపం అందుకేనా?
థర్మల్ యూనిట్ల నుంచి ఉత్పత్తి పెంచాలంటే కనీసం 6 టైం బ్లాక్లు ముందుగా చెప్పాలి. వెంటనే ఉత్పత్తి పెంచాలని ఒత్తిడి చేయడంతో జెన్కోకు చెందిన కృష్ణపట్నం, విజయవాడలోని వీటీపీఎస్ల బాయిలర్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ రెండింటి నుంచి కలిపి రోజుకు 1300 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. వీటిని శనివారం ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని జెన్కో అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తిని కొనసాగించాలన్నా థర్మల్ప్లాంట్ల దగ్గర బొగ్గునిల్వలు లేకపోవడంతో ఆందోళన పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Power cuts, Power problems