ఏపీలో అసలే మద్యం ధరలు ఎక్కువ. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. అధిక రేట్లకు లభిస్తుంటాయి. అది కూడా తమకు నచ్చిన బ్రాండ్ లేదని మద్యం ప్రియులు తెగ బాధపడిపోతుంటారు. అలాంటి వారికి రోడ్డు పక్కన.. పొరుగు రాష్ట్రం మద్యం ఉచితంగా దొరికితే.. ఊరుకుంటారా..! ఎగబడి మరీ ఎత్తుకెళ్తారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ కారు నుంచి పెద్ద మొత్తంలో మద్యం పాకెట్లు బయటపడడంతో.. వాటిని ఎత్తుకెళ్లేందుకు జనాలు పోటీపడ్డారు. అందిన కాడికి పట్టుకుపోయారు.
పరువు హత్య కేసులో సంచలన నిజాలు.. అలా చేయడం వల్లే..
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పొన్నమాకులపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు పలమనేరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఓ కారు బోల్తాపడింది. అతి వేగంతో అదుపు తప్పి.. రెయిలింగ్ను ఢీకొట్టి..అలాగే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అందులో ఉన్న మరో ఇద్దరు కారు వదిలి పరారయ్యారు. ఐతే ఆ కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. అది కూడా కర్నాటక మద్యం. ఐదారు సంచుల్లో మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటన తర్వాత మద్యం సంచులు.. రోడ్డు పక్కన పడిపోయాయి. ఆ పాకెట్లు కనిపించడంతో... వాహనదారులు, స్థానికులు ఎగబడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి... పరిశీలించారు. మిగిలిన మద్యం పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా అందులో ప్రయాణించిన వారి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alcohol, Chittoor, Liquor, Local News