గురువులంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి. విద్యార్థినులకు చదువుతో పాటు సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని నూరిపోయాలి. కానీ ఆ కాలేజీలో గురువులు మాత్రం కీచకులకంటే దారుణం. విద్యార్థినులను తండ్రిలాగా ఆదరించాల్సిన వారు కామంతో చూశారు. చెప్పుకోలేని మాటలతోవేధిస్తున్నారు. విద్యార్థినులకే కాదు మహిళా లెక్చర్లరపై కూడా ఇదే తంతు. డబుల్ మీనింగ్ డైలాగులు, వెకిలి చేష్టలతో అక్కడికెళ్లాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా తలపుల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరిస్థితి ఇది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం.
ప్రస్తుతం ఈ కాలేజీలో పర్మినెంట్ లెక్చరర్లు ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారికీ పెళ్లిళ్లై భార్య,బిడ్డలున్నా.. కాలేజీకి వచ్చే విద్యార్థినులతో వెకిలి చేష్టలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వచ్చి ఒళ్లో కూర్చోవాలని వేధించడం, గోవాలో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా అని అడగమే కాకుండా.. ప్రతిరాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పి పడుకోవాలని వేధిస్తున్నారు. అంతేకాదు తమతోపాటు కదిరి వస్తే కావాల్సిన తినిపిస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
ఇక విద్యార్థినులే కాకుండా మహిళా లెక్చరర్లు కూడా వేధింపులనెదుర్కొంటున్నారు. సినిమా డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులతో తమను ఇబ్బంది పెడుతున్నారని.. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని వాపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వేధింపుల వ్యవహారాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
గత ఏడాది కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లాలోని ఓ గ్రామంలో అంగన్ వాడీ టీచర్ పోస్టు ఐదేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో ఓ యువతి తాను ఆ పోస్టుకు అన్ని విధాలుగా అర్హురాలినని భావించి దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగానికి అప్లై చేసుకునేముందు ఆధార్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆన్ లైన్ పోల్టల్లో తనకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేసుకుంది.
ఐతే కలెక్టరేట్లోని ఎల్ఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సదరు యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆన్లైన్ ప్రక్రియ నమోదుకు వెళ్లిన నాటి సాయంత్రం నుంచే ఆ యువతితో మొబైల్ ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. కచ్చితంగా ఉద్యోగం కావాలంటే నేను చెప్పింది చేయాలి అంటూ హుకుం జారీ చేసాడు. ఉద్యోగం డబ్బుతో అయ్యే పనికాదని.. పడక సుఖం కావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఓ ఉన్నతాధికారి రూమ్ కు వెళ్లి అతనితో ఏకాంతంగా గడిపితే అపాయింట్ మెంట్ ఆర్డర్ వస్తుందని చెప్పాడు. ఐతే ముందుగానే అప్రమత్తమైన బాధితురాలు సదరు ఫోన్ కాల్ ను రికార్డ్ చేసింది. ఆ తర్వాత కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో కీచకులపై చర్యలు తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Harassment