ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను చలిగాలులు వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఎప్పుడూ వెచ్చగా ఉండే కృష్ణా జిల్లాలోనూ చలిపులి పంజా విసురుతోంది. శీతాకాలంలో చలి సాధారణమే అయినా గతంతో పోల్చితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం ఆసక్తికి రేకెతిస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత చలి ప్రజలను వణికిస్తోంది. సాధారణంగా విజయవాడ (Vijayawada) పరిసర ప్రాంతాలు కాస్త వెచ్చగానే ఉంటాయి. శీతాకాలం వచ్చినా చలి తీవ్రత అంతగా తెలియదు. కానీ ఈసారి రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రెండు రోజుల క్రితం విజయవాడలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా నమోదైందంటేనే తెలుస్తోంది ఇక్కడ చలితీవ్ర ఎంతగా ఉందో.
ఈనెల 18న తెల్లవారుజామున విజయవాడలో 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది నిజంగా విజయవాడేనా లేక విశాఖ ఏజెన్సీనా అనేస్థాయిలో చలిపుడుతోంది. సాయంత్రం 5గంటలకే చలి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం 8గంటలు కూడా చలి వీడటం లేదు. విజయవాడతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఏపీలోని ఇతర ప్రాంతాల్లో కూడా గతంలో కంటే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శీతాకాలంలో సాధారణంగా 17-22 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతాయి. విశాఖ ఏజెన్సీలో సగటున 8 నుంచి 15 డిగ్రీలు ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అరకు, పాడేరు, చింతపల్లి, పెదబయలు తదితర ప్రాంతాల్లో 5 నుంచి 9 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీలోని గిరిజనులు ఇళ్లనుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు.
అటు రాయలసీమ జిల్లాల్లోనూ చలి తీవ్రత అధికంగానే ఉంది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్లో ఈ నెల 18న రికార్డు స్థాయిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.ఇటు విశాఖ ఏజెన్సీ విషయానికి వస్తే.. గురువారం అరకులో 5.4 డిగ్రీలు నమోదైంది. పెదబయలు, డుంబ్రిగూడ 5.7, జి.మాడుగులలో 5.9, జీకే వీధిలో 6.5, చింతపల్లి 7.7లో, హకుంపేటలో 7.8, పాడేరులో 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇటు కర్నూలులో 14.2, విజయవాడలో 14.6, అనంతపురంలో 15.2, తిరుపతిలో 15.8, ఒంగోలులో 15.9, ఏలూరులో 15.9, శ్రీకాకుళం, కడపల్లో 16.2, గుంటూరులో 16.3, విశాఖపట్నంలో 18.2, కాకినాడలో 18.7 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలికి కారణమిదే..!
ఉత్తరాది నుంచి చలిగాలలు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కిలోమీటర్ల ఎత్తులో వీస్తున్న గాలుల వల్ల చలితీవ్రత పెరిగిందన్నారు. ఈ గాలుల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణంగా వెల్లడించారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, WINTER