నవరత్నాల పథకంతోనే పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,641 రైతు భరోసా కేంద్రాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది పాలన ఎంతో నిబద్ధతతో సాగిందని, 90 శాతం హమీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను, ప్రమాణాలను ఏడాదికాలంగా అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు 129 కాగా.. అమలు చేసినవి 77 ఉన్నాయని వివరించారు. అమలు కోసం మరో 35 హామీలు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పకుండా అమలు చేసినవి మరో 40 వరకూ ఉన్నాయని వివరించారు. ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అవినీతికి తావులేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం.
పింఛన్లకు రూ.1500 కోట్లు ఖర్చవుతోంది. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచినవన్నీ పూర్తి చేస్తూ వస్తున్నాం. రాష్ట్రంలోని కోటి 78 లక్షల వెనుకబడిన వర్గాలకు రూ.19,309 కోట్లు ఖర్చు చేశాం. గిరిజనుల సంక్షేమానికి రూ.2,136 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పేదలకు రూ.1722 కోట్లు ఖర్చు చేశాం. ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా నేరుగా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పైసా లంచం ఇవ్వకుండా, వివక్షకు తావులేకుండా చేస్తున్నాం. ఫింఛన్ , రేషన్ కార్డు వంటి ఏ పనైనా సులభంగా జరిగేలా ఏర్పాటు చేశాం. 540 రకాల సేవలతో గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి.
గ్రామంలో ఏది కావాలన్నా లంచం లేకుండా పనులు చేసుకోవచ్చు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తపిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రెండు వేల జబ్బులను తీసుకొచ్చి.. పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నాం ’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు.
Published by:Narsimha Badhini
First published:May 30, 2020, 13:08 IST