నేడు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బీఏసీ సమావేశానికి టీడీపీ తరపున హాజరైన అచ్చెన్నాయుడు.. సభ ఆలస్యంపై ప్రశ్నించారు. గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే సమావేశాన్ని ఆలస్యంగా ప్రారంభించామని సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ కామెంట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ దాడులపై చర్చ జరగాలని అచ్చెన్నాయుడు కోరగా.. తమ పార్టీ ఎంపీ సురేశ్పై టీడీపీ చేసిన దాడిపైనేనా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తమను టీవీల్లో చూపించడం లేదని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆరడుగుల ఆజానుబాహుడివి.. నువ్వు కనిపించకపోవడం ఏంటన్న అని అచ్చెన్నాయుడుపై సెటైర్ వేశారు.
అనంతరం శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించకుండా ఆమోదించినందుకు నిరసనగా వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబులా నటించడం తమ ముఖ్యమంత్రికి రాదని టీడీపీకి చురక అంటించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు సరిపోకపోతే చంద్రబాబు, లోకేష్.. జూమ్ మీటింగ్ పెట్టుకోవాలని కొడాలి నాని విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్చాట్ చేసిన కొడాలి నాని.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. తమ భద్రత కన్నా ప్రజల భద్రతే తమకు ముఖ్యమని... పేర్ని నాని ఎన్నడూ ప్రజల్లోనే, ప్రజల మనిషిగా తిరుగుతున్నారని కొడాలి నాని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy, Kinjarapu Atchannaidu