news18-telugu
Updated: November 11, 2020, 9:18 PM IST
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదే విధంగా, ఎటువంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్ వినియోగం లేకుండా చేసే అవకాశాలనూ చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్ వాటర్తో ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్ అదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్లో నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ వారిని ఆదేశించారు. అవుకు టన్నెల్-2 పనుల్లో ఫాల్ట్ జోన్లో మిగిలిన 137 మీటర్లు సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తంగా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. అదే విధంగా, అవుకు మూడో టన్నెల్కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని అధికారులు వివరించగా... సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 11, 2020, 9:18 PM IST