ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రైతుల ఉత్పత్తులు ఇకపై ఈ కామర్స్ (e-Commerce) వెబ్ సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) ప్రతినిథులకు ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) సూచించారు. గురువారం సీఎం జగన్ తో ఫ్లిప్ కాట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫ్లిప్ కార్ట్ పెట్టుబడులపై సమాచారంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం ఫ్లిప్కార్ట్ సీఈఓకు వివరించారు. రైతులకు పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్ కార్ట్ దోహదపడాలని సీఎం విజ్ఞప్తిచేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలుచేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల పర్యవేక్షణకు సీఎంయాప్ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కూడా సీఎం జగన్ కోరారు. తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతులనుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్కార్ట్ సీఈఓ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఇ–కామర్స్ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్కార్ట్కు పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్ స్కిల్యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలన్నారు.
సీఎం జగన్ చేసిన ప్రతిపాదనలపై ఫ్లిప్కార్ట్ సీఈఓ సానుకూలత వ్యక్తంచేశారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థవ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాదినుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు.
ఇక మత్స్య ఉత్పత్తులు రాష్ట్రంనుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ఫ్లిప్ కార్ట్ సహాయపడాలని సీఎం విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే తమ భాగస్వామ్య సంస్థ వాల్ మార్ట్ ద్వారా రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల కొనుగోలు, ఎగుమతి జరుగుతోందని, దీన్ని మరింతగా పెంచుతామని ఫ్లిప్ కార్ట్ సీఈఓ కళ్యాణ్ తెలిపారు. సీఎం దార్శినికత బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు ఆయన అంకితభావంతో ఉన్నారన్నారు. తన ఆలోచనలన్నీ పంచుకున్నారన్నారు. సీఎం జగన్ను కలిసిన వారిలో ఫ్లిప్కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తితోపాటు, సీసీఏఓ రజనీష్కుమార్, సీఎం కార్యదర్శి సోలోమన్ ఆరోకియా రాజ్ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.