ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) రైతులకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే అన్నదాతల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని (YSR Rythu Bharosa) అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రైతులకు డ్రోన్లు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకురానుంది. శుక్రవారం వ్యవసాయం, ఉద్యాన శాఖలపై సమీక్ష నిర్వహించిన జగన్.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ల వల్ల మోతాదుకు మించి రసాయనాల వినియోగం క్రమంగా తగ్గుతుందని తద్వారా పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. ఇకపై ప్రతి రైతు భరోసా కేంద్రంలో డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అలాగే డ్రోన్ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, కిసాన్ డ్రోన్లు, ఖరీఫ్ సన్నద్ధత, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం.. అధికారులకు కీలక సూచనిలిచ్చారు. ఈ ఏడాది నుంచే రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన సీహెచ్సీలు, క్లస్టర్ సీహెచ్సీల్లో ఉన్న యంత్రాలు కాకుండా డిమాండ్ సర్వే ఆధారంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ సబ్సిడీపై పరికరాలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
ఇక జూన్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు 3 వేల ట్రాక్టర్లను అందజేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. 4,014 ఆర్బీకే స్థాయి సీహెచ్సీ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ప్రారంభించాలన్నారు. 402 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్ స్థాయి సీహెచ్సీలను కూడా ప్రారంభించాలని ఆదేశించారు.
ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకం డబ్బులను ఈనెల 16న రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అలాగే జూన్ 15లోగా పంటల బీమా పరిహారాన్ని రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి రైతుకు రైతు భరోసా పథకం అందేలా చర్యలు తీసుకోవాలని.. ఎక్కడా తేడా జరగడానికి వీల్లేదన్నారు. ఆర్బీకే కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలన్న సీఎం.. పంట బీమాకు సంబంధించిన జాబితాను ఆర్బీకేల్లో ప్రదర్శించాలన్నారు.
యూనివర్సిటీల ద్వారా విద్యార్థులు ఆర్బీకేల్లో ఆరు నెలల ఇంటర్న్షిప్ పూర్తి చేసేలా కోర్సులను రూపొందించాలన్న జగన్.. విద్యార్థుల పరిశీలన, సలహాలు ఆర్బీకేల పనితీరును మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. అలాగే సీఎం యాప్ పనితీరుపై నిరంత పర్యవేక్షణ ఉండాలన్న జగన్.., పంటలకు ఎక్కడైనా మద్దతు ధర లభించకుంటే అధికారులు వెంటనే స్పందించి ఆదుకోవాన్నారు. ఆర్బీకేల్లో కియోస్క్లు సమర్థవంతంగా పనిచేయాలని.., ప్రతీ ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండేలా చూడాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy