ఎన్నికల సందడి ముగిసింది. ఫలితాలు వచ్చేందుకు ఇంకా 25 రోజుల టైం ఉంది. ఈలోపు ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటున్న నేతలు... సమ్మర్ వేడి నుంచీ ఉపశమనం పొందేందుకు చల్లటి ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత ఐదు రోజుల పర్యటనకు స్విట్జర్లాండ్ వెళ్లారు. శనివారం ఆయన తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. ఐతే... టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఫ్యామిలీతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా వెళ్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు వెళ్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడ్రోజులపాటూ అక్కడే గడపనున్న చంద్రబాబు... సోమవారం తిరిగి అమరావతికి రాబోతున్నారు.
నిజానికి ఎన్నికలు పూర్తైన వారంలోపే ఈ నేతలు టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లాలనుకున్నారు. ఐతే... ఈవీఎంలు, వీవీప్యాట్లపై దేశవ్యాప్త ప్రచారంలో చంద్రబాబు తలమునకలైతే... స్ట్రాంగ్ రూంల భద్రత విషయంలో ఆందోళన చెందిన వైసీపీ నేతలు కూడా సమ్మర్ టూర్లను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. పోలింగ్ జరిగిన పది రోజుల తర్వాత టూర్లకు వెళ్లినా... ఎక్కువ కాలం గడపకుండా తిరిగి వెంటనే వచ్చేసేలా ప్లాన్స్ వేసుకోవడానికి ప్రధాన కారణం కూడా స్ట్రాంగ్ రూంలనే తెలుస్తోంది.
ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండు పార్టీలూ గెలుపుపై వంద శాతం ధీమాతో ఉన్నాయి. ఐతే... స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలపై దాడులు జరగొచ్చని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. ఒక దశలో స్ట్రాంగ్ రూంలకు తామే తాళాలు వేసుకుంటామని వివిధ పార్టీల ఏజెంట్లు కోరగా... అందుకు ఈసీ ఒప్పుకోలేదు. తాము పూర్తి భద్రత కల్పిస్తున్నామనీ, ఆందోళన అవసరం లేదనీ తెలిపింది. కావాలంటే ఏజెంట్లు రోజంతా అక్కడే ఉండి పర్యవేక్షణ చేపట్టుకోవచ్చని సూచించింది. దాంతో ఆయా పార్టీలు స్ట్రాంగ్ రూంల దగ్గర సొంత నిఘా పెట్టించుకొని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.