MP Parimal Nathwani: కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు రూ. 200 కోట్ల నిధులను అందించింది. మరో 58.4 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఈ మేరకు సమాధానం అందించారు. ఏపీలో కరోనా నియంత్రణ కోసం కేంద్రం ఎలాంటి ఆర్థిక సహకారం అందిస్తుందనే విషయాన్ని పరిమళ్ నత్వానీ రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తొలి దశలో రూ. 3000 కోట్లు, రెండో దశలో 1256.81 కోట్లు అందించినట్టు కేంద్రం తెలిపింది.
ఇందులో భాగంగా ఏపీకి తొలి దశలో రూ. 141.46 కోట్లు, రెండో దశలో 116.82 కోట్లు వచ్చాయి. రెండో దశకు సంబంధించి 58.41 కోట్లు రావాల్సి ఉందని కేంద్రం వెల్లడించింది. కేంద్రం నుంచి రూ. 3.10 కోట్ల విలువైన యంత్రాలను కూడా సమకూర్చింది. ఇక ఏపీకి సెప్టెంబర్ 11 నాటికి కోటి 87 లక్షల విలువ చేసే లక్షా 70 వేల ఆర్ఎన్ఏ కిట్స్ కేంద్రం నుంచి వచ్చాయి. వీటితో పాటు కోటి 68 లక్షల విలువ చేసే లక్షా 22 వేల వీటీఎమ్ మెషిన్లు, 13 కోట్ల రూపాయల విలువ చేసే 2 లక్షల 46 వేల 567 ఆర్టీ పీసీఆర్ కిట్లు ఏపీకి కేంద్రం నుంచి వచ్చాయి.
ఇప్పటివరకు ఏపీకి కేంద్రం 14.63 లక్షల ఎన్95 మాస్కులు, 2,79 పీపీఈ కిట్లు, 31.5 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు, 3960 వెంటిలేటర్లు అందించింది. కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలకు సంపూర్ణ సహాకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకోసం రూ. 15000 కోట్ల ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Parimal Nathwani