ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది. ప్రత్యేక హోదా (Special Status), విశాఖపట్నం రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone) తో పాటు కీలకమైన పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రత్యేక హోదా సంగతి పక్కనబెట్టేసిన కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినా ఇంతవరకు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలుకాలేదు. వీటి సంగతి పక్కనబెడితే మరో కీలక హామీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అదే కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు. దీనిపై కేంద్రం కనీసం కన్నెత్తికూడ చూడటం లేదు. పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం 2017లో గెయిల్, HPCLతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.25వేల కోట్లతో పెట్రోకారిడార్ ఏర్పాటవుతుందని అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే రెండు మూడేళ్లలో పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులు ఊపందుకుంటాయని ఈస్ట్ కోస్ట్ కారిడార్లో రూ.25వేల నుంచి రూ.30వేల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని.. అలాగే అనుబంధ సంస్థలను కలుపుకుంటే మొత్తం రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఇందుకోసం కాకినాడ సెజ్ లో 2వేల ఎకరాల భూమిని కూడా కేటాయించింది. ప్రాజెక్టు కోసం ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు ఇతర పన్నుల కింద ప్రతి ఏటా రూ.975 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై అప్పట్లో ఎలాంటి స్పందన రాలేదు. 2017 తర్వాత ఈ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో పలుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు.
గత ఏడాది వయబిలిటీ గ్యాఫ్ ఫండింగ్ కింద 15 ఏళ్ల పాటు రూ.975 కోట్ల చొప్పున ఇవ్వాలని రాష్ట్రం కోరినా కేంద్రం స్పందించలేదు. కేంద్రం పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ నిధులను ఇచ్చేందుకు ముందుకొస్తేనే ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతుందని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఇటీవల స్పష్టం చేశారు. రాష్ట్రం నిధులిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం, కేంద్రం కూడా సీరియస్ గా స్పందించకపోవడంతో లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రానికి తలమానికంగా ఉండే ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.