తెల్లబంగారంగా పేరుగాంచిన జీడి మామిడి.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) నుంచి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) వరకు మెట్ట ప్రాంతాల్లోని రైతులకు అధికలాభాలను తెచ్చిపెడుతోంది. ఈ పంటలో జీడిగింజల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ,ఆ జీడి మామిడి పండ్లకు మాత్రం అంత డిమాండ్ ఉండదు. అవి తోటల్లో చెట్ల కింద రాలిపోతూ, కుళ్లిపోతున్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ఏడాదికి కొన్ని లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృథా అవుతున్నాయని తెలుస్తోంది. కలర్ఫుల్గా ఉండే ఈ జీడిమామిడిని తినగానే గొంతులో ఒకరకమైన ఫీలింగ్ వస్తుంది. అందుకే అందదూ దీన్ని తినడానికి ఇష్టపడుతుంటారు.
కాకపోతే ఒకటి, రెండు రోజులకు మించి ఈ జీడికాయలు నిల్వ ఉండవు. త్వరగా కుళ్లిపోతాయి. జీడిమామిడి పండ్లు ఎక్కువగా తోటల్లో రాలిపోతూ, భూమిలోనే కలిసిపోతుంటాయి. వాస్తవానికి వీటిలో అనేక రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వీటి వినియోగంపై దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK) గ్రామీణ రైతు మహిళలకు శిక్షణ ఇస్తూ.., కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి.
జీడిమామిడితో ఎన్నో పానీయాలు..!
జీడిమామిడి పండ్లతో పలురకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటి రసంతో కూల్ డ్రింక్స్, గుజ్జుతో జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, చట్నీ, ఊరగాయ, టూటీ ఫ్రూటీ, టాఫీ, వినిగర్, తయారు చేస్తారు. గోవాలో లభించే ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం కూడా జీడిమామిడి పండ్ల రసం నుంచి తయారవుతుంది. మొదట బాగా మగ్గిపోయిన జీడిమామిడి పండ్లను సేకరించి.. నీటితో శుభ్రం చేసిన తరువాత ప్రత్యేక మెషీన్తో రసాన్ని తీస్తారు. ఇందుకు జ్యూస్ తీసే మెషిన్నే ఎక్కువ మంది వాడుతుంటారు. ఈ మెషిన్ వల్ల ఒక పండు నుంచి దాదాపు 70శాతం రసం తీయోచ్చు. ఆ లెక్క ప్రకారం గంటకు 150 కిలోల పండ్ల నుంచి రసాన్ని తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రసంలో ఉన్న టెనిన్స్ని తొలగించడానికి సగ్గు బియ్యంతో తయారు చేసిన గంజిని ఉపయోగిస్తుంటారు. మనం వేసవిలో పెట్టుకునే ఆవకాయ మాదిరిగా జీడిమామిడి కాయతో పచ్చడి పెట్టవచ్చు. దీనితో చిప్స్ లాంటి స్నాక్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు.
రసం తీసేసిన తర్వాత వచ్చే పిప్పితోనూ ప్రయోజనాలెన్నో..!
జ్యూస్ ఎక్స్ట్రాక్టర్తో జీడిమామిడి నుంచి రసం తీసిన తరువాత వచ్చే పిప్పి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా , వర్మీ కంపోస్టుగా ఉపయోగపడుతుంది. గోవాలో అయితే ఈ పిప్పిని లిక్కర్ తయారీలో వాడతారు. ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్’అనే పదార్థాన్ని తయారుచేయోచ్చు. ఇది మనం రెగ్యులర్గా బ్రెడ్లలో తినే జామ్, సాస్, కెచప్ల తయారీలలో చిక్కదనం రావడానికి వాడుతారు.
కొన్ని రకాల మందుల్లోనూ..!
జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ జీడిమామిడి పండును వాడతారు. మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు…అంతేకాదు ఈ జీడిమామిడి పండును తీసుకుంటే అరికాళ్ల పగుళ్లు తగ్గుతాయట. వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి.. పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తుంటారు.
ప్రాసెసింగ్ యూనిట్లతో ఉపాధి కల్పన
కేరళలో ఇప్పటికే జీడిమామిడి పండ్లతో తయారుచేసిన రసాన్ని శీతల పానీయంగా విక్రయిస్తున్నారు. అదే విధంగా మన దగ్గర కూడా జీడిమామిడి పండ్లను ప్రాసెస్ చేయడానికి ఫుడ్ ప్రాసెంగ్ యూనిట్ల నెలకొల్పితే మెట్టప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపొచ్చు. ఈ పండ్ల నుంచి తీసిన రసాన్ని యాప్సీ, ఫ్రూటీ, మాజాల మాదిరిగా టెట్రా ప్యాకింగ్ చేసి అమ్మితే మరికొంత ఆదాయం వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Andhra Pradesh, Mango