Bettings on GHMC Election Results: భాగ్యనగరంలో సెటిలర్ల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో ఏపీకి చెందిన బడాబాబులు, రాజకీయ నేతలు గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై కోట్లలో బెట్టింగ్ వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4న విడుదల కానున్నాయి. దీంతో సహజంగా ఇక్కడ పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ, పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ ఉండడం సహజం. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఏపీలో కూడా హడావిడి నెలకొంది. ఆ హడావిడి చేసేది ఎవరో కాదు. బెట్టింగ్ రాయుళ్లు. ఐపీఎల్ 2020 అయిపోవడంతో బెట్టింగ్ సీజన్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల కన్ను జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం ఎవరిది? టీఆర్ఎస్ మరోసారి సెంచరీ కొడుతుందా? బీజేపీకి ఖాతాలో ఎన్ని డివిజన్లు రాబోతున్నాయి? కాంగ్రెస్, టీడీపీల ప్రభావమెంత? ఇదేదో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్న అంశాలు కాదు. బెట్టింగ్ రాయుళ్లు వేస్తున్న పందేలు. బ్యాలెట్ బాక్సులపై కరెన్సీతో బెట్టింగులు కట్టేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన సిటీ హైదరాబాద్. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన లక్షలాది మంది హైదరాబాద్ లోనే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. భాగ్యనగరంలో సెటిలర్ల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో ఏపీకి చెందిన బడాబాబులు, రాజకీయ నేతలు గ్రేటర్ పీఠంపై కోట్లలో బెట్టింగ్ వేస్తున్నారు. ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, విశాఖ, ఏలూరు, తిరుపతి, అనంతపురం లాంటి ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని గంటల్లో బల్దియా ఫలితం రాబోతుండటంతో బెట్టింగ్ తారాస్థాయికి చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్ అంతా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య సాగుతోంది. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతోంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ కే విజయావకాశాలెక్కువగా ఉన్నాయని, ఎక్కువ మంది టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతుండగా.. బెట్టింగ్ రేషియోలో మాత్రం బీజేపీనే ముందుంది. టీఆర్ఎస్ గెలిస్తే బెట్టింగ్ 1:1గా ఉండగా.. అదే బీజేపీ గెలుపుపై బెట్టింగ్ 1:4గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 1:5గా ఉంది. అంటే బీజేపీ గెలిస్తే రూ.100కు రూ.500 వస్తాయన్నమాట. ఇక ఓల్డ్ సిటీలో బలంగా ఉన్న MIMపైనా బెట్టింగ్ జరుగుతోంది. ఎంఐఎం మేయర్ పీఠాన్ని దక్కించుకునే అంశంపై 1:5 బెట్టింగ్ నడుస్తోంది.
విశ్లేషకులు టీఆర్ఎస్ కు 70-80 మధ్య సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నందున పార్టీల పరంగా వచ్చే సీట్ల సంఖ్యపై ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. బీజేపీకి 20-30 సీట్ల వస్తాయనే అంచనాలపై పందేలు నడుస్తున్నాయి. ఇక సెటిలర్స్ ఎక్కువగా ఉన్న డివిజన్లపైనా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఓవరాల్ గా చూస్తే జీహెచ్ఎంసీ రిజల్ట్స్ పై రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల బుకీలు సిండికేట్లుగా ఏర్పడి బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇక బెట్టింగ్ వేసేవారిలో ఎక్కువ మంది బీజేపీని సపోర్ట్ చేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఇతర వ్యాపారులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
క్లబ్బులు, పబ్బులు, గెస్ట్ హౌస్లలో బెట్టింగ్ కార్యకలాపాల కోసం ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాదు ఫలితాల కోసం టీవీలు, ఇతర సౌకర్యాలు సిద్ధంచేశారు. మరి గ్రేటర్ వార్ లో గెలిచే పార్టీలు.. బెట్టింగ్ రాయుళ్ల జేబులు నింపుతాయో లేక ఖాళీ చేస్తాయో వేచి చూడాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.