బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు, హైదరాబాద్.
చికెన్ బిర్యానీ కావాలంటే.. మినిమం వంద రూపాయలు అయినా ఖర్చు పెట్టాలి. వంద నోటు ఇస్తే.. ఓ సింగిల్ చికిన్ బిర్యానీ దొరుకుతుంది. అదే బిర్యానీ రూ.2కే దొరికితే.. అవును మీరు చదివింది నిజమే. రూ.2కు కనీసం చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో బిర్యానీ ఎలా వస్తుందనే కదా మీ అనుమానం. అసలు విషయంలోకి వెళితే... అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ, గడచిన 200 రోజులుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభించి 200 రోజులు అయిన సందర్బంగా హిందూపురంలో రూ.2కే చికెన్ బిర్యానీ వడ్డించారు.
రూ.2కే చికెన్ బిర్యానీ అని తెలియడంతో అన్న క్యాంటీన్ సమీపలోని ప్రజలంతా తండోప తండాలుగా తరలి వచ్చారు. దాదాపు 2 వేల మంది చికెన్ బిర్యానీ లాగించేందుకు సిద్దం అయ్యారు. అన్న క్యాంటీన్ నిర్వాహకులు కూడా ఇందుకు సిద్దంగా వచ్చారు. జనం భారీగా వస్తారని పెద్ద మొత్తంలో చికెన్ బిర్యానీ సిద్దం చేశారు. వచ్చిన వారందరికీ కాదనకుండా రూ.2కే చికెన్ బిర్యానీ వడ్డించారు. కేవలం చికెన్ బిర్యానీ మాత్రమే కాదు. స్వీటు, ఎగ్ కూడా అదనంగా అందించారు. తిన్నవారికి తిన్నంత చికెన్ బిర్యానీ పెట్టడంతో ఇక హిందూపురం ప్రజల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా క్యూలో నిలబడి వారికి కావాల్సినంత చికెన్ బిర్యానీ పెట్టించుకుని ఆరగించారు.
రూ.2కే ఎందుకు చికెన్ బిర్యానీ పెట్టారు. అనే అనుమానం రావచ్చు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు రూ.2కే బియ్యం పథకం ప్రవేశ పెట్టారు. ఆ రోజుల్లో 3 కోట్ల మంది బియ్యం అన్నం రుచి చూశారు. అందుకే ఎన్టీఆర్ పేరు చెబితేనే రూ.2 బియ్యం గుర్తుకు వస్తాయి. అన్నగారి పథకాన్ని ఆ తరవాత అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని, వారు కూడా అమలు చేశారు. రూ.2 గుర్తుగా తాజాగా రూ.2కే చికెన్ బిర్యానీ అందించి బాలయ్య మరోసారి వార్తల్లో నిలిచారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో 200 రోజులుగా స్థానిక ఎమ్మెల్యే, హీరో బాలయ్య భోజనం అందిస్తున్నారు. 200 రోజుల్లో 2 లక్షల మంది పేదలకు రూ.5కే భోజనం అందించినట్టు నిర్వాహకులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు మూసి వేసింది. దీంతో లక్షలాది కూలీ పేదలు రోడ్డున పడ్డారు. వందలు ఖర్చు చేసి హోటళ్లలో భోజనాలు చేయలేక ఆకలికి నకనకలాడారు. ఇది గుర్తించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని 250 కేంద్రాల్లో సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. అయితే హిందూపూరంలో అన్న క్యాంటీన్ నిర్వహణ ఖర్చు మొత్తం బాలయ్య భరిస్తున్నారు. గడచిన 200 రోజుల్లో కోటి రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల మందికి భోజనం పెట్టామని అన్న క్యాంటీన్ నిర్వాహకులు గర్వంగా చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chicken biryani, NTR