ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) యుద్ధానికి దిగడంతో అక్కడ మెడిసన్ తో పాటు వివిధ రకాల కోర్సులు చదువుతున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో స్టూడెంట్స్ అంతా మధ్యలోనే చదువులు ఆపేసి తిరిగి ఇండియా వచ్చేశారు. ఐతే వారి చదువులు ఇప్పుడు ప్రశ్నార్ధంగా మారాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో చదువుకుంటూ మధ్యలోనే వచ్చేశారు. దీంతో వారి భవిష్యత్తుపై మంచి నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో వైసీపీ (YSRCP) కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినందున దేశీయ వైద్య విద్యా సంస్థల్లో వారికి ప్రవేశం కల్పించి చదువు కొనసాగించేలా ఆదుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని విజయసాయి రెడ్డి లేవనెత్తారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో వైద్య విద్యను అభ్యసిస్తూ చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్ధులను క్షేమంగా మాతృదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. అయితే ఉక్రెయిన్ కారణంగా తీవ్రమనోవ్యధ అభవించిన వైద్య విద్యార్ధులు ఇప్పుడు అర్థాంతరంగా నిలిచిపోయిన తమ చదువులతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని సాయిరెడ్డి అన్నారు.
ఉక్రెయిన్లో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశాలు కనిపించడం లేదని.., ఇలాంటి అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మానవతాధృక్పదంతో, ఒక అరుదైన కేసుగా పరిగణిస్తూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికల్ విద్యార్ధులు దేశీయ యూనివర్శిటీలలో తమ చదువును కొనసాగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
దేశంలో ఏదైనా మెడికల్ కళాశాల మూతబడిన పక్షంలో విద్యార్ధులను వివిధ మెడికల్ కళాశాల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తోందని.., ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్ధుల విషయంలో కూడా ప్రభుత్వం అలాంటి ఒక ప్రత్యేక బదిలీ విధానాన్ని రూపొందించాలని విజయసాయి రెడ్డి సూచించారు. ఉక్రెయిన్లో పరిస్థితులు చక్కబడే వరకు తాత్కాలికంగా వారు ఇక్కడి వైద్య కళాశాలల్లో విద్యను కొనసాగించేలా చూడాలని అన్నారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధుల దయనీయ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని వారి భవిష్యత్తును కాపాడేందుకు, దేశీయ మెడికల్ కళాశాలల్లో వారి చదువులు నిరంతరాయంగా కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Rajyasabha, Vijayasai reddy