ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరోసారి వేడెక్కాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య మొదలైన మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (TDP Leader Ayyanna Patrudu) చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య అగ్గిరాజేశాయి. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా ఉండవల్లిలోని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ (MLA Jogi Ramesh) వైసీపీ కార్యకర్తలతో సహా అక్కడికి వెళ్లారు. ఐతే అప్పటికే అక్కడున్న టీటీడీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న (Budha Venkanna), టీటీడీ కార్యకర్తలు.. ఎమ్మెల్యే జోగిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. జోగి రమేష్ – బుద్ధా వెంకన్న ఒకరినొకరు తోసుకున్నారు.
జోగి-బుద్ధా వెంకన్న ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పస్పరం తిట్టుకుంటూ.. తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఏకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తోపులాటకు దిగడంతో కార్యకర్తలు జెండాకర్రలతో కొట్టుకున్నారు. అక్కడున్న పోలీసులు కూడా వీరిని అదుపు చేయలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు భారీగా చేరుకొని వారిని అదుపు చేశారు. తాము నిరసన చేపట్టేందుకు వస్తే గూండాలతో అడ్డుకుంటున్నారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లో కూర్చోని తనపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు కౌంటర్ గా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ నేతలు పట్టాభి, నాగుల్ మీరా, ఇతర నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తన్నారని.. సీఎం జగనే ఆ పార్టీ ఎమ్మెల్యేని చంద్రబాబుపైకి ఉసిగొల్పారని ఆరోపించారు.
అసలేం జరిగింది..?
గురువారం దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చికెన్ అమ్ముతారా.. చేపలు అమ్ముతారా..? నాటు సారా అమ్ముతారా..? చేతగాని పాలకులంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ను దూషిస్తే చూస్తూ ఊరుకోమని.. చంద్రబాబుని, అయ్యన్నపాత్రుడ్ని రాష్ట్రంలో తిరగనివ్వమంటూ జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.
అయ్యన్న తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే చంద్రబాబును, లోకేష్ ను రాష్ట్రం నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. సీఎం జగన్ కు క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తేలేదని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇంటి నుంచి బయటకు రావాలని సవాల్ విసిరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Jogi Ramesh, TDP, Ysrcp