ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఘటనలు మరవకముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల సందర్భంగా రెండువర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిపాలెంలో దారుణం జరిగింది. గ్రామ సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి గంటా చంద్రకళ మరిదిపై విప్పర్తి పవన్ కుమార్ పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 7 చోట్ల కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు
ప్రచారం ముగిసిన తర్వాత ఇంట్లో పడుకున్న పవన్ కుమార్.. రాత్రివేళ బయటకురాగా గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ కుమార్ పరిస్థితి నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసం అమలాపురం తరలిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. పవన్ కుమార్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పొల్గొంటుండటంతోనే ఓ పార్టీకి చెందిన వారు అతడిపై ఎటాక్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పవన్ కుమార్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్ములపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ప్రచారం సందర్భంగా ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు ఎదురుపడటంతో మాటామాట పెరిగి వివాదం రేగింది. దీంతో ఇరువర్గాలు తోపులాటకు దిగారు. అక్కడితో ఆగకుండా పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. ఘటనలో ముగ్గురికి గాయాలవగా.. గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను అడ్డుగుకున్నారు. గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Crime, Crime news, East Godavari Dist, Gram Panchayat Elections, Local body elections, Murder attempt, Telugu news