Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
Target Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అన్ని పార్టీల్లో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు అన్నది అధికారికంగా డేట్లు ఫిక్స్ కానప్పటికీ.. ఏ క్షణంలోనైనా ఎన్నికలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే అంతా ముందుకు వెళ్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఈ సారి జనసేన సైతం భారీగానే కసరత్తులు చేస్తోంది. ఈ దసరా నుంచి నేరుగా రంగంలోకి దిగేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సిద్ధమయ్యారు. మరోవైపు కొన్నినియోజక వర్గాల్లో జనసేనకు బలం పెరిగిందనే అన్ని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన బలం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు సైతం పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఈ సారి భారీగా పవన్ వెంటే ఉంటారనే ప్రచారం ఉంది. దీంతో ఆ వర్గం ఓట్లపై వైసీపీ అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy ) ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. తొలి నుంచి సామాజిక లెక్కల పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. 2019 లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ పార్టీ గెలుపుకు కలిసి వచ్చింది. ఇక, అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేబినెట్ మొదలు పార్టీ పదవుల వరకు అన్నింటా సామాజిక సమీకరణాలు అమలు చేస్తున్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కడతారని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకు ఇప్పటి వరకు పవన్ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలే కారణం. అయితే ఈ అంశమే ఇప్పుడు వైసీపీని కాస్త టెన్షన్ పెడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన కాపు ఓటింగ్ ఈ సారి కొంత మేర పవన్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. నివేదికలు సైతం అదే విషయం చెబుతున్నట్టు ప్రచారం ఉంది.
అందుకే కాపు వర్గం ప్రధానంగా ప్రభావితం చేసే గోదావరి జిల్లాల్లో పరిస్థితుల.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్ర్తత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నట్టు టాక్. తాజా సర్వేల్లో సైతం.. అక్కడ పవన్ బలం పెరిగినట్టు చెబుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేసేందుకు సిద్దమయ్యారంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు.
దీంతో..పాటుగా కాపు ఓటింగ్ తమ నుంచి చేజారకుండా కాపాడుకొనేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే దశాబ్దాల కాలంగా కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభంతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ముద్రగడకు వైసీపీ నుంచి భారీ ఆఫర్ అందినట్టు తెలుస్తోంది. అయితే ముద్రగడ లేదా.. ఆయన కుటుంబం నుంచి ఎవరికైనా పదవి ఇచ్చేందుకు వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
ఇదీ చదవండి : బాబోయ్ బాహుబలి ఎద్దు..! రూపమే కాదు.. పేరు కూడా అలనే ఉంది
2014-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా రాజకీయంగా వేడి పెంచారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేయించటం.. నిర్బంధించటం పైన ముద్రగడ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, జగన్ సీఎం అయిన తరువాత ముద్రగడ కొన్ని అంశాల పైన లేఖలు రాయటం మినహా ప్రభుత్వం పైన విమర్శలు చేయలేదు. రాజకీయంగానూ మౌనంగా ఉంటున్నారు. గతంలో సుదీర్ఘ కాలం చట్ట సభలకు పని చేసిన ముద్రగడను వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. కానీ, ముద్రగడ కుటుంబం నుంచి ఆయన కుమారుడికి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్దమైందని తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం సాగుతోంది.
ఇదీ చదవండి: A టు Z ఏదైనా.. అతి తక్కువ ధరకే.. ప్రత్యేకంగా నిలుస్తున్న సండే మార్కెట్
ముద్రగడ కుమారుడు పార్టీలో చేరితే.. ప్రత్తిపాడు స్థానం కేటాయించేలా ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. దీని ద్వారా ముద్రగడ మద్దతు వైసీపీకి ఉండేలా ఆ జిల్లా నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ కారణంగా ఏదైనా పార్టీ ఓట్ బ్యాంక్ కు నష్టం జరిగితే..అది ముద్రగడ కుటుంబ మద్దతు ద్వారా భర్తీ చేసుకొనే అవకాశం ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Mudragada Padmanabham, Pawan kalyan