MLC Ananta Babu: ఏపీలో పెను సంచలంగా మారిన ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రమణ్యం (Driver Subrhmanyam) హత్య కేసు (Murder Case) మిస్టరీ పూర్తిగా వీడింది. రాజకీయంగా వేడి పుట్టించిన ఈ హత్యకేసు విషయంలో పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అటు హత్య చేసింది అధికార పార్టీ నేత కావడంతో.. ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదు. అరెస్ట్ కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తీవ్ర ఒత్తిళ్లు, ఆందోళన మధ్య నిన్న రాత్రే పోలీసుల ముందు ఎమ్మెల్సీ అనంతబాబు లొంగిపోయాడు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు (DIG Palaraju) ఆఫీస్కు.. తన కారులోనే స్వయంగా వెళ్లి సరెండర్ అయ్యారు. ఈ హత్య తానే చేశానని స్వయంగా అనంతబాబే ఒప్పుకున్నాడు. హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది.. వివాదం ఎక్కడ మొదలైంది.. ఎలా హత్య చేసింది అన్ని వివరాలను పూసగుచ్చినట్టు చెప్పినట్టు సమాచారం. ఈ హత్య కేసులో తప్పించుకునే వకాశం లేకపోవడంతోనే.. పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. స్వయంగా అనంతబాబే హత్యను అంగీకరించడంతో.. కాసేపట్లో మేజిస్ట్రేట్ ఎదుట అనంతబాబును(Ananta Babu) హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
సుబ్రహ్మణ్యంది పక్కగా హత్యేనని మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా మొదటి నుంచి అదే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి అదే నిజమని తేలింది. అంతేకాదు సుబ్రమణ్యం ప్రైవేట్ పార్ట్స్పై బలంగా కొట్టడంతోనే ఆయన మృతి చెందాడని పోస్ట్మార్టంలో వెల్లడైంది. అలాగే.. సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలు నిర్ధారణ అయ్యాయి. సుబ్రహ్మణ్యం ఎడమ చేయి, ఎడమకాలి బొటనవేలు, తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై అనంతబాబును పోలీసులు ప్రశ్నించారు.. అప్పుడు తానే ఈ హత్య చేశానని.. తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతోనే చంపేశానని అంగీకరించినట్టు సమాచారం. అంతేకాదు ఈ హత్యలో మరెవరి ప్రమేయం లేదని.. తాను ఒక్కడినే హత్య చేసినట్టు అనంతబాబు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి అన్ని టికెట్లు.. రేపే విడుదల..
అయితే ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు పెరిగాయి. ఇది హత్య అయిన పోలీసులకు తెలిసినా.. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనే అరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ. రాత్రి వేళల్లో ఎంక్వైరీల పేరుతో టార్చర్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్యం సోదరుడు.
ఇదీ చదవండి : పవన్ ను సీఎం చేయడమే టార్గెట్.. మెగా ఫ్యాన్స్ కీలక భేటీ వెనుకు ఉన్నది ఎవరు..?
రాజకీయంగా ఒత్తిడి పెరగడంతోనే అనంతబాబును అరెస్ట్ చేశారని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. సుబ్రహ్మణ్యం మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. అప్పుడే నిజాలు బయటికొస్తాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మామూలోడు కాదన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఎమ్మెల్సీ రహస్యాలు ఎక్కడ బయటపడతాయోనని అనుమానించి సుబ్రహ్మణ్యంను చంపాడని ఆరోపించారు. అయితే జరుగుతున్న రాద్దాంతానికి.. బాధిత కుటుంబం ఆలస్యంగా స్టేట్మెంట్ ఇవ్వడమే కారణమంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చట్టానికి ఎవరూ చుట్టం కాదన్నారు. మరి హత్యను అంగీకరించిన అనంతబాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Kakinada, Murder case