YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార పార్టీలో అసమ్మతి రాగాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దాదాపు ప్రతి జిల్లాల్లోనూ ఎక్కడో ఒకచోటు గ్రూపు తగాదాలు రచ్చకు ఎక్కుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా (Vizianagaram District) రాజకీయాలు హాట్హాట్గా మారుతున్నాయి. వైసీపీ (YCP) లో వర్గపోరు పతాకస్థాయికి చేరుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చాలా చోట్ల నేతల మధ్య పోటీ ఉంటే.. ఇక్కడ మాత్రం సామాజికవర్గాల రణంగా మారడం.. అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla veerabadra swamy) పేరు వింటే చాలు.. అదే పార్టీకి చెందిన బీసీ నేతలు రుస రుసలాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోలగట్లకు కాకుండా బీసీలకు వైసీపీ టికెట్ కేటాయించాలని స్వరం గట్టిగా వినిపిస్తున్నారు. గత మూడు నెలలుగా విజయనగరం నియోజకవర్గంలో ఇదే పెద్ద చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఏ కార్యక్రమం చేపట్టినా బీసీ నేతలంతా ఒకే నినాదం అందుకుంటున్నారు. వీరి వెనక పార్టీ నేతలు పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్లు ఉండటంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది. అయితే వీరిద్దరూ మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa Satyanarayana) అనుచరులు కావడంతో.. సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తోంది. మంత్రి అండ చూసుకునే వారు ఇది చేస్తున్నారా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారనే గట్టి ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే కోలగట్ల. ఒకవేళ గ్రాఫ్ బాగులేదని పక్కన పెట్టినా.. తన కుమార్తె శ్రావణిని అయినా బరిలో దింపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పార్టీ టికెట్ చేజారే అవకాశం ఉండబోదని.. తన స్థాయిలో పావులు కదుపుతునే ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా.. టికెట్ తనదే అంటూ ఇటీవల మంత్రి బొత్స సమక్షంలోనే కొల్ల గట్ల కర్చీఫ్ వేశారు. వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ చుట్టూనే విజయనగరం రాజకీయంపై చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం విజయనగరంలో బీసీ నినాదం వెనక మంత్రి బొత్స ఉన్నట్టు ఎమ్మెల్యే కోలగట్ల అనుచరులు అనుమానిస్తున్నారట. అందుకే బొత్స సమక్షంలోనే తన వ్యతిరేకులకు సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారని భావిస్తున్నారు. వాస్తవానికి విజయనగరంలో బొత్స, కోలగట్ల మధ్య రాజకీయ విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అది మున్సిపల్ ఎన్నికల సమయంలో బయట పడింది కూడా. ఇద్దరూ ఎదురుపడితే నవ్వుతూ పలకరించుకుంటారు. ఎవరికీ కనిపించకుండా నొసటితో వెక్కిరించుకుంటారని పార్టీ వర్గాల టాక్.
ఆ మధ్య వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని కలెక్టరేట్ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం చెంత నిరసన తెలిపారు పార్టీ నేతలు. కాదూ కూడదని అంటే.. కోలగట్లను ఓడిస్తామని చెప్పేశారు. అప్పటి నుంచి విజయనగరంలో కోలగట్ట వర్గానికి, బీసీ నాయకులకు అస్సలు పడటం లేదు. మరి ఈ సమస్యను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.. లేదంటే ఎన్నికల్లో ఇబ్బంది తప్పకపోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, Vizianagaram, Ycp