Anna Raghu, News18, Amaravati
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కాంగ్రెస్ పార్టీ (Congress Party) తో జతకట్టి ఆ పార్టీ పూర్వవైభవానికి తీవ్రంగా శ్రమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతల నుండి గాంధీ కుటుంబం తప్పుకుని ఆ స్థానంలో ఎవరైనా సీనియర్ నేతను కూర్చో బెట్టాలని అలాగే సోనియా గాంధీని యుపీఏ ఛైర్ పర్సన్ గా కొనసాగాలని, రాహుల్ గాంధీ సేవలను ఆపార్టీ పార్లమెంటరీ బాధ్యతలలో నియమించి ప్రియాంక వాద్రాని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని అలాచేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవంపోసుకోలేదని ఇటీవల ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన 447 పేజీల నివేదిక లీకవ్వడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు అన్నింటిని ఏకతాటి పైకి తీసుకు రావాలని అందులో పీకే సూచించారు.
ఐతే శివసేన వంటి కొన్ని పార్టీలు యూపీఏలో చేరాలంటే మాత్రం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. యూపీఏ అధ్యక్షపీఠంపై కాంగ్రెస్ ఇతర పార్టీల నుండి ఎవరిని కూర్చో బెట్టినా తమకు పెద్దగా అభ్యంతరం లేదని అదే గనుక జరిగితే సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించమని పీ.కే తన నివేదికలో సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక దేశంలోని మిగతా ప్రాంతీయపార్టీల సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు 2019 ఎన్నికల తరువాత పీ.కే అత్యంత సన్నిహితుడిగా మారాడు. దీనిని అవకాశంగా చేసుకొని జగన్ న్ను కాంగ్రెస్ పార్టీతో జతకట్టే విధంగా ప్రశాంత్ కిశోర్ పావులు కదుపుతున్నాడనే చర్చ జోరందుకుంది. జగన్ గనుక కాంగ్రెస్ పార్టీతో జతకడితే యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించేలా ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
సోనియా గాంధీ తనని, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిందనే అక్కసుతో కాంగ్రెస్ ను వీడి సొంతగా పార్టీని ఏర్పాటు చేసుకున్న జగన్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టడం జరిగేపనేనా అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో శాశ్వత మితృలు శాశ్వత శత్రువులు ఉండరనే సూత్రం మహా మొండిఘటం ఐన జగన్ పై ఎంత వరకు ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేం.
ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులు, తనతో పాటు మరికొందరు పార్టీ సహచరుల మెడలో వేలాడుతున్న సీబీఐ కేసులు, తొందరపాటుతో ఇంకో రెండేళ్ళు అధికారంలో ఉండే బీజేపీతో ఏరికోరి వైరం తెచ్చుకోవడం ఎందుకు అనే భావన ఏపీ సీఎంని వెంటాడే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల మాట. మరో వైపు 2019 ఎన్నికలలో ఓటమి తరువాత బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు.. జగన్-బీజేపీ బంధానికి బ్రేక్ పడితే తప్ప టైమ్ కలిసిరాదు. జగన్ కాంగ్రెస్ చెంతకి , తాను బీజేపీ పంచన చేరే అవకాశం చంద్రబాబుకు దక్కుతుంది.
ఐతే ప్రశాంత్ కిశోర్ ని నమ్మి సగానికి పైగా రాష్ట్రాలలో అసలు ఉనికిలోనే లేని కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం జగన్ కు అంత మంచిది కాదని, అవసరం ఐతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఎంతో కొంత మేలు జరుగుతుందని, దీనికి తోడు చంద్రబాబు పొత్తుల రాజకీయం చిత్తుచేయడం తేలిక అనేది జగన్ భావనగా రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Prashant kishor, Sonia Gandhi