ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల రేపుతున్న రాజకీయ వేడి అంతా ఇంతా కాదు. ఎన్నికల సందర్భంగా పార్టీల కంటే ఎక్కువగా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యే యుద్ధం నడిచింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఆ విమర్శల మధ్యే ఎస్ఈసీ తొలి విడత ఎన్నికలు నిర్వహించారు. అలా తొలిదశ ఎన్నికలు ముగిశాయో లేదో.. సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్లూ వైసీపీ.. నిమ్మగడ్డపై దుమ్మెత్తిపోస్తుంటే.. ఇప్పుడు టీడీపీ కూడా అదే దారిలో వెళ్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంలో ఎస్ఈసీ విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. దీనిపై ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖలు రాశారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ తన అధికారాలు పూర్తిగా ఉపయోగించలేదని చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని.. అధికారపార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నవారిపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలపై ఎస్ఈసీకి, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం లేదని.. కేంద్ర ప్రభుత్వ బలగాలను పంపి సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలు అప్రజాస్వామికంగా జరగడానికి ఎన్నికల కమిషనర్ నిర్లక్ష్యం.. వైసీపీ నేతల అరాచకాలే కారణమని ఆరోపించారు.
కారణం అదేనా..?
ఇన్నాళ్లూ వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడు రూటు మార్చి ఎస్ఈసీని కూడా టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన డైరెక్షన్ల నిమ్మగడ్డ నడుస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ఈ స్టాండ్ తీసుకున్నారా లేక రాజకీయ వ్యూహంలో భాగంగా లేఖలు రాశారే అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి ఎస్ఈసీ చర్యలన్నీ అధికార పార్టీ టార్గెట్ గానే సాగాయి. మేనిఫెస్టో విషయంలో టీడీపీ పట్ల కఠినంగా వ్యవహరించలేదన్న నిందలు కూడా నిమ్మగడ్డపై పడ్డాయి. అధికార పార్టీ నేతలకు నోటీసులిస్తూ, చర్యలకు ఆదేశిస్తున్న నిమ్మగడ్డ.. టీడీపీ విషయంలో మాత్రం అంత సీరియస్ గా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
నిమ్మగడ్డ పాచిక పారలేదు - కుట్రలన్నీ పటాపంచలయ్యాయి తొలివిడత పంచాయతీ ఎన్నికల్లోనే చంద్రబాబును అద్దంలో చూపించేశారు ప్రజలు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తి అధికారాలు ఉపయోగించలేదంటూ లేఖలు రాస్తున్నాడు నాయుడుబాబు. ప్రజలు ఓట్లేయకపోయినా టీడీపీ వారిని సర్పంచులుగా ప్రకటించాలా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 12, 2021
అంతా డ్రామా..
ఇక ఎస్ఈసీకి వ్యతిరేకంగా చంద్రబాబు లేఖలపై మంత్రులు ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు ఎస్ఈసీని తిట్టడం పెద్ద డ్రామా అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు ఏం చెప్తే నిమ్మగడ్డ అది చేస్తారని.. నిమ్మగడ్డ ఏపనైనా చేసే ముందు బాబును సంప్రదిస్తారని ఆరోపించారు. అలాగే లేఖల పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. నిమ్మగడ్డ పాచిక పారకపోవడంతో చంద్రబాబు లేఖలు రాస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP Politics, Chandrababu Naidu, Gram Panchayat Elections, Local body elections, Nimmagadda Ramesh Kumar, Ramnath kovind, TDP, Ysrcp