AP POLITICS TDP MLA EX MINSTER GANTA SRINIVASA RAO READY JUMP PARTY LOOKIN ON JANASENA AND TRAILS CONTINUE IN YCP NGS VSP
AP Politics: ఆ ఎమ్మెల్యే రూటెటు? వైసీపీలోకి ట్రయల్స్.. జనసేన వైపు చూపు
వైసీపీ లోకి ట్రయల్స్, జనసేన వైపు చూపు
AP Politics: ఆయన మాజీ మంత్రి.. ప్రస్తుతం ఎమ్మెల్యే.. ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఎక్కడైనా విజయానికి ఆయన చిరునామా? కానీ గత కొంత కాలంగా ఆయన కన్ఫ్యూజ్ లో ఉన్నారో.. కన్ఫ్యూజ్ చేస్తున్నారో తెలియడం లేదు. తాజాగా వైసీపీలోకి ట్రయల్స్ వేస్తూనే.. జనసేన వైసు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు.
P Anand Mohan, Visakhapatnam, News18. Andhra Pradesh Politics: ఆయన రాజకీయ వ్యూహం ముందు ఎందరో ప్రత్యర్థులు చిత్తయ్యారు.. ప్రతి ఐదేళ్లకు ఓ సారి నియోజకవర్గం మారినా గెలుపు మాత్రం అతనిదే.. పార్టీ ఏదైనా.. విజయం తనవైపే ఉండేది. అలాంటి నేత.. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా.. అయినా ఆయన సైలెంట్ గానే ఉన్నారు. మరి వ్యూహాత్మకంగా అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా.. లేక ఆయనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా అన్నది ఆయన అనుచరులకు కూడా అంతు చిక్కడం లేదు. ఓ వైపు పదవికి రాజీనామా అంటూ హడావుడి చేస్తున్నారు. స్పీకర్ ను సైతం తన రాజీనామా ఆమోదించాలని పదే పదే కోరుతున్నారు. కాపులను ఏక తాటిపైకి తెస్తున్నారు. ఉక్కు ఉద్యమానికి నాయకుడిగా నిలవాలి అనుకుంటున్నారు. ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ అనుకున్న మైలేజ్ రావడం లేదు. దీంతో వెంటనే ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆయనెవరో ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది. ఇంకెవరో కాదు.. టీడీపీ (TDP) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao).
ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఆయన నిర్ణయాలు ఇప్పుడు ప్రత్యేకంగా ఆసక్తి పెంచుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి రాజకీయ కాన్సెప్ట్ తో ముందుకొస్తారో తెలియడం లేదు. ఎన్నికలు జరిగి మూడేళ్లు అవుతున్నా.. ఆయన ఏ పార్టీలో ఉన్నారు.. ఏ పార్టీలోకి వెళ్లాలి అనుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు అన్నది క్లారిటీ రావడం లేదు. ప్రతి సారి నియోజకవర్గాన్ని మార్చే అలవాటు ఉన్న ఆయన.. ఇప్పుడు అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియక ఆయన అనుచరులే తికమక అవుతున్నారు.
అయితే ఇప్పుడు అంతా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో.. తక్షణమే ఆయన కూడా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహారాలు చేస్తున్నారో? లేక వైసీపీకి ఆ కమ్యూనిటీని దగ్గర చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో..? జనసేనకు ఊపు తీసుకురావాలని చూస్తున్నారో అర్ధం కావడం లేదంటూ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆయన అనుచరలు.
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న ఆయన.. తన రాజీనామాను ఆమోదించాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖరేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతేడాది ఫిబ్రవరి 21న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఆమోదించకపోవడంతో ఆయన స్పీకర్ కు లేఖ రాశారు. ఇప్పటి వరకు రాజీనామా ఆమోదించి కపోవడం సరైంది కాదనీ.. నా రాజీనామా ఉద్యమానికి బలం చేకూరుతుందని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు కూడా. అయితే తన రాజీనామా ఆమోదించిన తరువాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
2014 నుంచి టీడీపీతోనే ఆయన ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చేశారు.. అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేగా గెలిచిన సరే పార్టీలో కనిపించడం లేదు.. సరే నియోజకవర్గంలోనైనా కనిపిస్తున్నారా? అంటే అది లేదు...పోనీ వేరే పార్టీలోకి వెళ్తారా అంటే అది లేదు. అసలు టోటల్ గా ఊహకు అందని రాజకీయం నడిపిస్తున్నారు.
ఇటీవల కాపు నేతలతో కలిసి హైదరాబాద్ లో సమావేశమయ్యారు..ఈ మధ్య కూడా విశాఖలో సమావేశమయ్యారు.. ఈ సమావేశాలు టీడీపీ కోసమేనా అంటే ఏమో ఎవరికి క్లారిటీ ఉండదు.. పైగా ఆ సమావేశాల్లో టీడీపీ కాపు నేతలు పెద్దగా ఉండరు. మరి గంటా ఏం చేస్తున్నారయ్య? అంటే ఏమో అనే సమాధానం వస్తోంది.
గంటాపై సొంత పార్టీ వాళ్ళకే నమ్మకం లేనప్పటికీ.. జనసేన కోసమే పనిచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. మరికొందరైతే కాపుల ఓట్లని చీల్చడానికి గంటా ప్లాన్ చేశారని, అలా చేసి వైసీపీకి లాభం చేకూర్చాలని అనుకుంటున్నారని మరికొందరు చెబుతున్నారు. ఆయన అనుచరులను ఆఫ్ ది రికార్డు అడిగితే మాత్రం.. వైసీపీలో ప్రయత్నాలు చేస్తున్నారని.. జనసేన వైపు చూస్తున్నారని చెబుతున్నారు. మరి ఆయన మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదేమో..?
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.