ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం బుధవారం విద్యుత్ ఛార్జీలను (Electricity Charges hike) పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్లాబుల వారీగా యూనిట్ కు 40 పైసల నుంచి రూ.1.57 వరకు పెంచింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తప్పుబట్టారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు తన తండ్రి ఇచ్చినట్టే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానంటూ పేద్ద పేద్ద మాటలు చెప్పారని., అధికారం అందాక మోటార్లకి మీటర్లు బిగించి వ్యవసాయానికి ఉరితాళ్లు బిగించారని లోకేష్ మండిపడ్డారు. సీఎం పదవి కోసం జగన్ తొక్కని అడ్డదారి లేదని.., మోసపు మాటలకి లెక్కేలేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాడు విపక్షనేతగా పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడంటూ రాగం తీసిన జగన్..., ఇప్పుడు ప్రభుత్వాధినేతగా దేశంలో అతి ఎక్కువ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీ పేరిట రికార్డు నెలకొల్పారన్నారు. కరెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జగన్ తీసిన దీర్ఘాలు స్థాయిలోనే మూడేళ్లలో కరెంటు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ కొట్టించారని లోకేష్ ఎద్దేవా చేశారు.
కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్లను తీసుకొచ్చి, ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసిందని లోకేష్ ఆరోపించారు. ఒక ఏడాదిలో ఇచ్చే అన్నిపథకాల డబ్బంతా ఏడాది కరెంటు బిల్లులకే సరిపోనంత స్థాయిలో పెరగనుండడం ఏ బాదుడో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తుంటే అపోహలు సృష్టించడంపైనా, 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తే ఇవ్వలేదని చెప్పిన అబద్ధాలపైనా, కరెంటు చార్జీలు పెంచకపోయినా బాదుడే బాదుడంటూ తప్పుడు ఆరోపణలు చేయడంపైనా జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు.
ఉచిత విద్యుత్పై మాట తప్పి మోటార్లకు మీటర్లు బిగించారని.., కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అప్పగించిన మిగులు విద్యుత్ ఉత్పత్తిని, లోటు విద్యుత్ స్థాయికి దిగజార్చారని.,. టీడీపీ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏపీ విద్యుత్ రంగాన్ని తన విధ్వంసక విధానాలతో సంక్షోభంలో పడేశారని లోకేష్ ఆరోపించారు.
అసలే కరోనా కష్టాలు, ఇంటి పన్ను, చెత్త పన్నుల పెంపుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రజలపై పదేపదే పన్నులు, ధరల భారాలను ప్రజలపై మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Nara Lokesh