ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరోసారి కొత్త జిల్లాల రగడ నెలకొంది. కొత్తగా ఏర్పడిన కొనసీమ జిల్లా (Konaseema District) కు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తామని ప్రభుత్వం ప్రతిపాదించడంతో రచ్చ మొదలైంది. జిల్లాను కోనసీమ జిల్లాగానే ఉంచాలంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళనకు పిలువునివ్వడం.. ప్రభుత్వం 144 సెక్షన్ విధించినా నిరసనకారులు భారీగా తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టేంత వరకు ఉద్రిక్తతలు దారితీశాయి. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో అమలాపురంకు అదనపు పోలీసు బలగాలు కూడా తరలివెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా జగన్ సర్కార్ వైఫల్యమేనని ఆరోపిస్తున్నాయి.
ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని., ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ పై నెట్టాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని చంద్రబాబు అన్నారు. ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమన్న చంద్రబాబు.., కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యమేనని.., కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.
అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమలాపురం ఘటనపై స్పందించారు. కోనసీమలో నెలకొన్న ఉద్రిక్తతలను ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేనాని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే బాబాసాహెబ్ అంబేడ్కర్ అంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన పేరును ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం చాలా ఆవేదన కలిగిస్తోంది అన్నారు. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ డిమాండ్ చేశారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని పవన్ ఆరోపించారు.
కోనసీమ జిల్లా విషయంలో ఆందోళనకారులు తమ అభ్యర్థనను శాంతియుతంగా తెలపాలేగాని, ఇటువంటి దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇటువంటి దాడులు సామాజిక ప్రయోజనాలకు విఘాతం. దాడులకు తెగబడ్డ వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాన్నారాయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, Chandrababu Naidu, East Godavari Dist