P Anand Mohan, News18,Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. కేవలం విశాఖపట్నం (Visakhapatnam) నే కాదు.. మొత్తం ఏపీ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గాజువాక అగ్రస్థానంలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే. జనసేన (Janasena) తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గాజువాక (Gajuwaka) నుంచే పోటీ చేసి ఓడారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేస్తా అంటూ గట్టిగా ప్రకటించారు. అలాగే ఈ సారి ఎలాగైనా సరే గెలుస్తా అంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్. ఐతే పవన్ ప్రత్యర్థిపై విశాఖలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం ఈసారి పవన్ ను ఢీ కొట్టబోయేది ఆషామాషీ నేతకాదు గెలుపుకు కేరాఫ్ అడ్రస్ అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అని జోరుగా ప్రచారం సాగుతోంది.
గాజువాక నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం తన వంతు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజువాక నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులును విశాఖ ఎంపీ స్థానానికి, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం కాలేజ్ ఛైర్మన్ శ్రీ భరత్ను భీమిలి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గంటా ఒప్పించినట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో గాజువాక నుంచి గంటా పోటీ చేయడం ఖరారైనట్లు టీడీపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు.
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారనే పుకార్లు ఇప్పటికే షికార్లు చేస్తున్నారు. ఇందుకు పవన్ చేసిన పొత్తుల ప్రతిపాదనను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో కూడా ఓ ఒప్పందం కుదిరినట్లు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గాజువాక నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్న గంటా శ్రీనివాస్... నియోజకవర్గ పరిధిలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖను స్పీకర్ ఫార్మెట్లోనే రాయడం వల్ల గాజువాక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు దాదాపు రెండున్నర ఏళ్ల వరకు పెద్దగా యాక్టివ్ గా లేని గంటా.. కేవలం స్టీల్ ప్లాంట్ ఆందోళన సమయంలోనే బయటకు వచ్చారు. నియోజకవర్గం నేతలతో ముచ్చటించారు. ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. దీంతో గాజువాక నుంచి గంటా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు నేతలు భావిస్తున్నారు.
అటు పవన్ కల్యాణ్ కూడా.. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. గాజువాక ప్రయోజనాలే ముఖ్యమనే ప్రకటనలుల చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే.. గాజువాక నియోజకవర్గం ఏ పార్టీ ఖాతాలో చేరుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అలాగే పొత్తు కుదరకపోతే ఇద్దరు బలమైన నేతల మధ్య సమరం ఎన్నికలకే హైలెట్ గా నిలవనుంది. ఓ వైపు పార్టీ అధినేత పవన్ అయితే... మరోవైపు రాజకీయాల్లో సీనియర్గా ఉన్న గంటా ఉన్నారు. ఈ ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడంతో గాజువాక రాజకీయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gajuwaka, Ganta srinivasa rao, Janasena party, Pawan kalyan, TDP