CM Jagan: తెలుగు రాష్ట్రాల్లో దేశీ గోసంతతి రాను రాను తగ్గుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. భారతదేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. దానికి కారణాలు ఏంటో తెలుసా.. తాజాగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan) ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి (Allola Divya Reddy) కలిశారు. దేశీ ఆవుల (Indian Cow) సంతతి తగ్గడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ.. పూర్తి వివరాలకు సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, కృత్రిమ గర్భధారణ పద్దతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సేవ్ దేశీ కౌస్ ప్రచారంలో భాగంగా ఆమె సీఎం జగన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోమయ గణపతి ప్రతిమను ఆమె జగన్ కు అందజేశారు. అంతేకాకుండా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాల గురించి సైతం సీఎం జగన్ ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టిన్ వంటి హైబ్రిడ్ జాతులతో కృత్రిమ గర్భధారణ వల్ల మన దేశీ ఆవు జాతులు ఎన్నో అంతరించి పోతున్నాయని, కాలక్రమేణా మన దేశవాళీ ఆవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సీఎం జగన్కు అల్లోల దివ్యారెడ్డి వివరించారు. కానీ మన దేశ మేలు రకమైన ఆవులను అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు పెంచి పోషిస్తున్నారని.. కానీ మనం మాత్రం అధిక పాల దిగుబడి కోసం హైబ్రిడ్ జాతుల పోషణకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి కారణాలతోనే నాసిరకం పాలు మన పిల్లలకు ఇస్తున్నామని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి క్రాస్ బ్రీడింగ్ పద్దతిని అరికట్టాలని, స్వదేశీ జాతుల అభివృద్ధికి కృషి చేయాలని ఆమె సీఎం జగన్ ను అభ్యర్థించారు. క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశీ ఆవుల ఉనికే ప్రమాదంలో పడిందని, క్రాస్ బ్రీడింగ్ పద్దతుల నివారణకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. తాను సుప్రీం కోర్టులో మే నెలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని, ఈ పిల్ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ లు జారీ చేసిందని సీఎంకు ఆమె వివరించారు.
ఇదీ చదవండి : ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? హరిద్ర గణపతిని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు..
ఆమె చెప్పిన మాటలు విన్న సీఎం.. దీనిపై సానుకూలంగా స్పందించి దేశవాళీ అవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అటు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని కూడా అల్లోల దివ్యారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దేశీ జాతి ఆవులను సంరక్షించాలనే లక్ష్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టామని.. దీనికి మద్దతు నివ్వాలని భారతిని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు స్వచ్ఛమైన ఏ2 మిల్క్ను అందించాలనే ఉద్దేశంతో పాటు హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో పని చేస్తున్నట్లు ఆమెకు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Cow