(AnnaRaghu,Sr.Correspondent,Amaravathi,News18)
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కాసు కుటుంబానికి కంచుకోట. ఇక్కడి నుండి కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్రమంత్రిగా,ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ వారసుడు కాసు వెంకట క్రిష్ణారెడ్డి. ఇక్కడి నుండి రెండుసార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా దశాబ్దాల పాటు సేవలందించారు. ఎంతో మందికి కాసు కుటుంబం రాజకీయ బిక్షపెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారు. రాజకీయ విలువలకు కట్టుబడి నాటి నుంటి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఐతే పార్టీలకు అతీతంగా "కాసు" కుటుంబానికి ఇక్కడ అభిమానులు ఉన్నారు. వాళ్లలో వైసీపీకి చెందిన వాళ్లు ఉన్నారు. అంతటి అనుబంధం ఉన్న నరసరావుపేటలో నేడు "కాసు" పేరుతో కనీసం ఫ్లెక్సీలు కూడా వేయించుకోలేని దుస్థితి తలెత్తింది.
పల్నాడులో పొలిటికల్ హీట్ ..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాలు ఒకలా ఉంటే .. పల్నాడులో మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తాయి. క్రిస్మస్ , నూతన సంవత్సరం వేడుకల్ని పురస్కరించుకొని "కాసు" అభిమానులు పార్టీలకు అతీతంగా నరసరావుపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకు సంభంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. "మీ రాక మా కోరిక..అందరినీ నమ్మడం ఆయన నైజం..నిజాలు మాట్లాడటమే ఆయన తత్వం..అందుకే నరసరావుపేట రాజకీయాలలో ఆయన రాక మాకెంతో ముఖ్యం." అంటూ స్లోగన్లు కూడా ముద్రించారు.
కాసు వర్సెస్ వైసీపీ ..
ఐతే ఫ్లెక్సీలలో స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి ఫోటో ముద్రించకపోవడం వైసీపీ వర్గీయులకు కోపాన్ని తెప్పించింది. తమ నేత పేరు లేదనే కారణంతో ఆయన వర్గీయులు ఫ్లెక్సీలను కట్టకుండా కాసు వర్గీయులను అడ్డుకున్నారు. అంతే కాదు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి నివాసంలో భేటీ అయి అభిమానులతో చర్చలు జరిపారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి ఫోటో వేయాల్సిందేనంటూ తేల్చిచెప్పారు. అందుకు కాసు వర్గీయులు నిరాకరించారు. విషయాన్ని సదరు నేతలు మాజీ మంత్రి కాసు.క్రిష్ణారెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన వైసీపీ ముఖ్య నేతలతో చర్చలు జరిపినప్పటికి ఫలితం లేదని తేలుస్తోంది.
ఫ్లెక్సీలో ఫోటో వేయలేదని ..
కాసు వెంకట క్రిష్ణారెడ్డే స్వయంగా కల్పించుకుని మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో ముద్రించిన ఫ్లెక్సీలను పక్కన పడేశారు ఆయన వర్గానికి చెందిన అభిమానులు,అనుచరులు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాసు కృష్ణారెడ్డి ఫ్యామిలీకి ఇంత అవమానం జరగలేదని, కోడెల వంటి నేత కూడా క్రిష్ణారెడ్డి పట్ల ఎంతో గౌరవంతో వ్యవహరించే వారని కాసు వర్గీయులు గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాదు ఈ విషయంలో కృష్ణారెడ్డికి జరిగిన పరాభవాన్ని తలచుకొని లోలోన రగిలిపోతున్నారంట.
వైసీపీ తీరుపై స్థానికుల్లో వ్యతిరేకత..
ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి చివరకు నరసరావుపేట వైసీపీలో పెను దుమారమే సృష్టించే ప్రమాదం లేకపోలేదంటున్నారు స్థానికులు. సౌమ్యుడిగా, అజాత శతృవుగా పేరుపొందిన కాసు వెంకట క్రిష్ణారెడ్డి గారి పట్ల స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆయన వర్గీయులు వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాసు పేరు వింటేనే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గం అభధ్రతా భావంలోకి వెళ్లిపోతుందని, కావాలనే కాసు కుటుంబాన్ని నరసరావుపేట రాజకీయాల నుండి తప్పించాలని ఎమ్మెల్యే వర్గం ప్రయత్నిస్తుందని కాసు ఆయన వర్గీయులు విమర్శిస్తున్నారు.
తీరు మార్చుకుంటే మంచిదని హితవు..
వివాదాలకు దూరంగా ఉండే కాసు వెంకట క్రిష్ణారెడ్డి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటే మాత్రం నరసరావుపేటలో వైసీపీ మనుగడ కష్టమేనంటున్నారు స్థానికులు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి పరిణామాలు పార్టీకి చేటు చేస్తాయంటున్నారు. ఇప్పటికైనా స్థానిక వైసీపీ నేతలు తమ ఒంటెద్దు పోకడలకు స్వస్తి చెప్పకపోతే రాబోయే ఎన్నికలలో తీవ్రపరిణామాలు తప్పవంటూ కాసు అభిమానులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, AP Congress, Ycp