M Bala Krishna, News18, Hyderabad
విలాసవంతమైన ఆ క్రూయిస్ షిప్ ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. షిప్ లోపలికి వెళ్లాలి.. అన్ని హంగులూ చూడాలని అందరూ భావించేలోపే అందులో రాజకీయ కోణం కూడా బయటపడుతోంది. క్రూయిజ్ షిప్ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కుమార్తె నిర్వహిస్తున్నారంటూ టీడీపీ (TDP) సోషల్ మీడియా (Social Media) లో ప్రచారం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు హాట్ కామెంట్లు విసురుతున్నాయి. అయితే ప్రతిపక్షం చేస్తోన్న ఆరోపణల్ని డిఫెండ్ చేసుకోవడంలో వైసీపీ అంతగా సక్సెస్ అవ్వడంలేదు. సరికదా.. క్రూయిజ్ షిప్ కు తమ పార్టీ నేతలకు సంబంధంలేదని కనీసం చెప్పడానికి కూడా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. విశాఖపట్నం తీరంలో ఘనంగా ప్రారంభమైన విలాసవంతమైన ఓడ 'క్రూయిజ్ షిప్' కార్డేల్లా ఇప్పుడు రాజకీయ దుమారంరేపింది.
విశాఖ నుంచి బయలుదేరిన ఈ నౌక నిన్న నడిసముద్రంలో ఆగిపోయింది. విశాఖ నుంచి తమిళనాడు రాష్ట్రానికి పక్కన పుదుచ్చేరికి బయలు దేరిన ఈ భారీ నౌకను అనుమతించేది లేదని పుదుచ్చేరి ప్రభుత్వం స్పష్టం చేయడంతో నడిసముద్రంలోనే వారి అనుమతి కోసం షిప్ ను ఆపివేయాల్సి వచ్చింది. ఇక తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఈ క్రూయిజ్ షిప్ సముద్రంలోనే ఉండిపోయింది. భారీ విలాసవంతమైన నౌకను పుదుచ్చేరి అధికారులు ఆపివేయడానికి కారణం కూడా పుదుచ్చెరీ క్లియర్ చేసింది.
బయట బాగా తెలిసిన విషయం ఏమిటంటే ఇందులో కేసినో గ్యాంబ్లింగ్ జరుగుతోందని.. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఓడను తమ పుదుచ్చేరిలోకి అనుమతించొద్దని తమిళ రాజకీయ పార్టీలు భారీగా డిమాండ్ చేస్తున్నాయి.ఇక ఈ క్రమంలోనే ఈ షిప్ ను అనుమతించడం ఇంకా అలాగే అనుమతించకపోవడంపై తాము స్పష్టంగా ఉన్నామని పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఆ షిప్ లో క్యాసినో గ్యాంబ్లింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తెలిపారు.అలాంటివేవి లేవని వారు నిర్ధారించుకోవాలన్నారు. పుదుచ్చేరి సమీపంలో లగ్జరీ షిప్ ను లంగర్ వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని తెలిపారు. టూరిజంను బాగా అభివృద్ధి చేయాలనే ఆసక్తితో ఉన్నామని.. కానీ మన సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోబోమని తమిళిసై స్పష్టం చేశారు.
కాగా ఇదే లగ్జరీ క్రూయిజ్ షిప్ ను 2 రోజులు 3 రోజులు 5 రోజులుగా ప్లాన్ చేశారు. తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ కార్డిలియా షిప్పింగ్ కంపెనీతో కలిసి చెన్నై పోర్టులో ఈ క్రూయిజ్ ను ప్రారంభించింది. విలాసవంతమైన ఈ క్రూయిజ్ షిప్ లైనర్ చెన్నై నుంచి పాండిచ్చేరి విశాఖపట్నంకు ప్రజలను విహారయాత్రకు తీసుకెళ్లాలి. ఇటీవలే వైజాగ్ లో దీన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఆ మరుసటి రోజే ఇది నడిసముద్రంలో అనుమతి లేకుండా ఆగిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. పుదుచ్చేరిలోకి దీన్ని అనుమతించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమై ప్రస్తుతం చెన్నైకి వెళ్లింది. కొందరు పర్యాటకులు కూడా పుదుచ్చేరి వెళ్లకుండా చెన్నైలోనే ఆగిపోయారు.
ఇక ఈ షిప్ నిర్వహణ.. విశాఖ కేంద్రంగా దీని కాంట్రాక్టును విజయసాయిరెడ్డి కుమార్తె తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శాఖలోని రుషికొండ ప్రాంతాన్ని, తొట్లకొండ ప్రాంతాన్ని ఇందుకే అధికార పార్టీ చదును చేయిస్తోందని అంటున్నారు. అక్కడే ఈ పర్యాటక నౌకలు నిలపడానికి బెర్తులు కూడా ఏర్పాటు చేయబోతున్నారని అంటోంది టీడీపీ. దీనికోసం అన్ని అడ్డదారులు తొక్కారని ఆరోపిస్తోంది. ప్రధానంగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి తీసుకుందని టీడీపీ సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తోంది. జురీ సీపోర్ట్ ఎల్ఎల్టీ (ZUREE SEAPORT LLP) పేరుతో ఈ షిప్ ను ఇక్కడికి తీసుకొచ్చారనేది టీడీపి వాదన. విశాఖ తొట్లకొండ ప్రాంతంలో ఇలాంటి షిప్ లను నిలపడానికి ఇక్కడ్నించి పర్యాటకంగా వేరే ప్రాంతాలకి తిప్పడానికి పర్యాటక సంస్థను ప్రారంభించారని టీడీపి చెబుతోంది. గతేడాది ఈ కంపెనీని విజయసాయిరెడ్డి కుమార్తె ప్రారంభించారట. అందులో భాగంగానే ఈషిప్ విశాఖకి చేరిందనేది టీడీపీ స్ట్రాంగ్ నినాదం.
దీనికోసం సీట్రన్ ఫెర్రీ కంపెనీ లిమిటెడ్ ( SEATRAN FERRY COMPANY LIMITED) అనే నౌకల తయారీ కంపెనీతో నేహారెడ్డి కాంట్రాక్టు చేసుకున్నారట. సముద్రంలో పర్యాటకానికి ఉపయోగించే షిప్ లను ఈ సంస్థ తయారు చేస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. అలాగే ఆ ఈ కంపెనీతో ఒప్పందానికి ఏడాది మునుపే జురీ సీపోర్టు సంస్థను ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా షిప్ కూడా రావడానికి పోర్టు నుంచీ అనుమతులు కూడా అలాగే పొందారని తెలుస్తోంది. ప్రధానంగా విశాఖ పోర్ట్ అథారిటీ (VISAKHAPATNAM PORT AUTHORITY) కేవలం ఈ షిప్ కి బెర్త్ ను కేటాయించింది. అదీ ప్రైవేటు షిప్ లు ఏ ప్రాతిపదికన వస్తాయో ఆమేరకు మాత్రమే అనుమతులు అందించిందని పోర్టు వర్గాలు చెబుతున్నాయి.
మరోపక్క ఈ విషయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మాత్రం పెదవి విప్పడం లేదు. ఇదంతా మేరిటైం బోర్డు (MARITIME BOARD), అంతర్యాతీయ సముద్రజలాలకి (INTERNATIONAL SEAS) సంబంధించిన అంశం అని మాత్రం చెప్పి తప్పించుకుంటోంది. ప్రధానంగా ఇందులో క్యాసినో.. విదేశీ పబ్ కల్చర్ వంటివి ఉండటమే తెలుగు ప్రజలకి తప్పుగా కనిపిస్తున్న విషయం. విశాఖలో ధాయ్, బ్యాంకాక్ కల్చర్ ను తీసుకొస్తున్నారని.. ఇక్కడి సంప్రదాయాల్ని, సంస్కృతిని పాడుచేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే దీని మాత్రం వైసీపీ ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. పర్యాటక శాఖ మంత్రి వచ్చి ప్రారంభించిన ఈ షిప్ విషయంలో అధికార పార్టీ ప్రమేయం నూటికి నూరు పాళ్లు ఉందని మాత్రం టీడీపీ గట్టి ప్రచారం చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Vijayasai reddy