Polavaram Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)-తెలంగాణ (Telangana) లను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. ముఖ్యంగా పోలరవం (Polavaram) చట్టూ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. భద్రాచలం దగ్గర వరద ఉధృతితో పోలవరం ఎత్తు తగ్గించాలన్న డిమాండ్ను మళ్లీ తెరపైకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). ప్రస్తుతం వచ్చిన వరదలతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. పోలవరం పూర్తయితే భద్రాచలం ఎప్పుడూ వరదలోనే ఉంటుందన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajaykumar). 45.5 అడుగుల ఎత్తులో వరద టెంపుల్ టౌన్లో నిలిచి ఉంటుందని చెప్పారు. పోలవరంలో గేట్లు ఆలస్యంగా ఎత్తడం వల్లే ఈసారి వరద తీవ్రత పెరిగిందని పువ్వాడ అజయ్ విమర్శించారు. వరద వచ్చినప్పుడల్లా ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి పోలవరం ఎత్తు తగ్గించాలని ఆయన కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రమాదాలు కొనసాగకూడదు అంటే.. భద్రాచలాన్ని అనుకుని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు పువ్వాడ అజయ్కుమార్. వరద వచ్చిన ప్రతిసారీ ఆ ఐదు గ్రామాల్లో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందన్నారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Amabati Rambabu) . ఎప్పుడు వరదలు వచ్చినా..? పోలవరం ఎత్తుపై రాజకీయం చేయడం సరికాదని సూచించారు. పోలవరంపై అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు అంబటి. పోలవరంలో 45.72 అడుగుల ఎత్తులో నీరు ఉన్నా భద్రాచలానికి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్రతిసారీ పోలవరం ఎత్తుపై వివాదం రేపడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే కేంద్రంతోనే చర్చించుకోవాలని తెలంగాణకు సూచించారు అంబటి.
మంత్రి బొత్స సైతం పువ్వాడ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలవరం విలీన గ్రామాలను తెలంగాణలో కలపని డిమాండ్ చేయడం సరికాదని.. ఒకవేళ హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా? అని పోలవరంపై బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారు..? డిజైన్ల ప్రకారమే జరుగుతోంది దాన్ని ఎవరూ మార్చలేదని ఆగ్రహించారు బొత్స సత్యనారాయణ. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశంమేనని.. విభజన చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని పేర్కొన్నారు.
వందేళ్ల తర్వాత మొదటిసారి ఈ నెలలో గోదావరికి ఇంత పెద్దఎత్తున వరద వచ్చిందని.. రాష్ట్రవిభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని గుర్తు చేశారు. హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా? ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా అని బొత్స కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని.. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యం బొత్స వివరణ ఇచ్చారు. సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలని బొత్స కోరారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదు..పువ్వాడ అజయ్ అయన సంగతి ఆయన చూసుకోవాలని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, Puvvada Ajay Kumar