కరెంటు మంటలు ఏపీ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపు (AP Electricity Charges) పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షంలో ఉండగా బాదుడే.. బాదుడు అంటూ ప్రస్తుత సీఎం జగన్ (CM YS Jagan) చేసిన విమర్శలు, కామెంట్స్ ను వైరల్ చేస్తన్నాయి. ఇదిలా ఉంటే విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న నిరసన తెలిపారు. లాంతర్ చేత పట్టుకుని పార్టీ కార్యాలయానికి వచ్చిన లోకేష్... అంధకార ప్రదేశ్, బాదుడే...బాదుడు పేరుతో లాంతర్ ప్రదర్శించారు. సీఎం జగన్ ఏపీలో కొత్త పథకం తెచ్చారని.., ఉగాది నుంచి పేదలపై ఛార్జీలతో బాదేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం నాడు రెండు చేతులూ ఊపుతూ జగన్ ఆవేశంగా చెప్పారని.., అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ. 12 వేల కోట్లు లాగేశారని విమర్శించారు.
ఇక చెత్త పన్ను వేస్తున్నారని.., ఇంటి పన్ను కూడా పెంచారని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా విద్యుత్ ఛార్జీలు పెంచారన్న ఆయన.., ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు ఉన్నాయన్నారు. పేదలు బాధపడాలి.. మధ్య తరగతి వారు ఇబ్బంది పడాలి.. ఇదేనా జగన్ విధానమని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్సుకు విద్యుత్ ఛార్జీలు పెరగకూడదనుకున్నారా..? ఎక్కువ వాడే వారికి తక్కువ పెంచారని నిలదీశారు.
పీపీఏలు రద్దు చేయడం వల్లే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని.., పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే పరిస్థితే ఉండేదన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదని., ఛార్జీలను తగ్గించే దిశగా చంద్రబాబు కృషి చేశారని లోకేష్ గుర్తుచేశారు. 2019 ఎన్నికల ముందున్న స్లాబులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ బయటకొస్తే పులివెందులకు వెళ్లి విద్యుత్ ఛార్జీలపై అక్కడి ప్రజస అభిప్రాయాలే తెలుసుకుందామని సవాల్ విసిరారు. చంద్రబాబు పండుగ నాడు నిత్యావసరాలు ఇచ్చి కానుకలిస్తే.. విద్యుత్ ఛార్జీలను పెంచి జగన్ ఉగాది కానుక ఇచ్చారని లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంతో పాటు పక్కనే ఉన్న డీజీపీ కార్యాలయంలో కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:10 గంటల వరకు కరెంట్ లేదని.., జగన్ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతానికే విద్యుత్ కోతలు ఉన్నాయన్నారు.
ఇది చదవండి: ఏపీలో కొత్త జిల్లాల ఎఫెక్ట్.. భూముల ధరలకు రెక్కలు.. అదనపు భారం తప్పదా..?
బహిరంగ మార్కెట్టులో విద్యుత్ కొనుగోలు చేసే అంశంలో కూడా కుంభకోణం చేశారని.. దానిని కూడా త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఏపీలో విద్యుత్ లోటు ఉంటే సీఎం, మంత్రి గాడిదలు కాస్తున్నారా..? అని ప్రశ్నించారు. విభజన తర్వాత ఏపీ పరిస్థితి గురించి మాట్లాడుతోంటే.. సత్తిబాబు గతాన్ని తవ్వుతున్నారని.. ఆయనకు మెమరీ తక్కువని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.