గుంటూరు (Guntur)జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy)కి ఎదురు లేదు. ఇది నిన్నటి మాట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ..నియోజకవర్గంలో బాగానే పేరు తెచ్చుకున్న వైసీపీ (YCP)ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు తాజాగా షాక్ ఇచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi)కాదు అనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో ఆయనపై ప్రజల్లో అభిమానం తగ్గుతూ వచ్చింది. అంతే కాదు..రాజధాని మార్పుకు తాను వ్యతిరేకం అనే మాటను మూడున్నర ఏళ్లలో ఏనాడు చెప్పలేదు ఆళ్ల రామకృష్ణరెడ్డి. దీంతో ఆయన గతంలో తిరిగినంత స్వేచ్ఛగా నియోజకవర్గంలో పర్యటించిన పరిస్థితి లేదు. తాజాగా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్తే ఆయనకు చేదుఅనుభవం ఎదురైంది. స్థానిక ఓటర్లు ఆర్కేను నిలదీశారు. అంతే కాదు రాజధాని ద్రోహి అంటూ ఓ ముద్రవేసి మరీ మంగళగిరి ఎమ్మెల్యే(Mangalagiri MLA) కారును అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ అంశం వైసీపీ నేతలతో పాటు గుంటూరు జిల్లా అధికార పార్టీ నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి చేదుఅనుభవం..
రాజకీయాల్లో అన్నీ రోజులు ఒకలా ఉండవు. పూలు చల్లించుకున్న చోటే రాళ్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. ఎన్నికల ముందు టీడీపీపై, రాజధాని భూముల కేటాయింపుపై న్యాయపోరాటం చేసి మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో అభిమానాన్ని చురగొన్న ఆర్కే ...అదే ప్రజా మద్దతుతో స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్పై గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే తాజాగా ఆయన్ని ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలే నిలదీశారు. రాజధాని తరలింపు అంశంపై ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్లో మంచినీటి పైప్ లైన్ను పరిశీలించేందుకు వెళ్లిన ఆర్కే కారును స్థానికులు అడ్డుకున్నారు. అమరావతి రాజధానిగా తరలించడంపై మీ అభిప్రాయం ఏంటో చెప్పమని నిలదీశారు.
ఆర్కేకు ఊహించని షాక్..
స్థానిక ఓటర్ల ద్వారా ఊహించని పరిణామం ఎదురవడంతో కారు దిగిన ఆర్కే..వాళ్లకు సమాధానం చెప్పలేదు. దీంతో వాళ్లంతా అసహనం, ఆగ్రహానికి గురై ..రాజధాని ద్రోహి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని తరలింపుపై మీ సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టడంతో కారు దిగిన ఆయన సమాధానం చెప్పకుండా వెంటనే కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈసారి ఓటమి తప్పదా..
గత ఎన్నికల్లో నారా లోకేష్ని స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. సౌమ్యుడు, రైతు కావడంతో ప్రజలు మద్దతిచ్చి గెలిపించారు. అయితే అమరావతి రాజధానిని మార్చుతున్నామని వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆర్కే నోరు మెదపకపోవడాన్ని ఆ ప్రాంత రైతులు, ఓటర్లు తట్టుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే ఈవిధంగా తమ నిరసనను, డిమాండ్ను స్వయంగా ఎమ్మెల్యేకు చూపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alla Ramakrishna reddy, Amaravati, Andhra pradesh news