ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రోడ్ల రాజకీయ (Politics) పీక్స్ కు చేరుకుంటోంది. రోడ్ల మరమ్మత్తులపై అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan)ఇచ్చిన ఆదేశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Party Chief Pawan Kalyan) స్పందించారు. రోడ్ల దుస్థితిపై జనసేన చెప్తేగానీ కళ్లు తెరవరా..? అని ప్రశ్నించిన పవన్.. ఇకనైనా ఆలస్యం చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో జనసేన నాయకులు, శ్రేణులు ఏకబిగిన సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తేనే వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరచి రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టిందన్నారు పవన్. లక్షల మంది రహదారి కష్టాలను చెప్పారు. వర్షాలు తగ్గాక అక్టోబర్ తరవాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు. అప్పుడు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుందని..,ఇక పనులెప్పుడు పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు.
ప్రభుత్వం పనులు ప్రారంభించేవరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్లే గతి కావచ్చని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ రోడ్లపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దృష్టి లేదన్న జనసేనాని... నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసేవారన్నారు.
“ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించుకొని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాను. ఏ రోడ్డు ఎన్ని కిలో మీటర్ల మేర దెబ్బ తిని ఉంది, మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను సేకరించండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబర్ తరవాత మీ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరం. జనసేన నాయకులు, శ్రేణులు సిద్ధం చేసే ఈ వివరాలతో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుంది.” అని పవన్ అన్నారు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ పైరుతో సోషల్ మీడియా ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే..! లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని రోడ్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ 6 లక్షల 20వేల మంది ట్వీట్లు చేయగా.. సోషల్ మీడియా ద్వారా దాదాపు రెండున్నర కోట్ల ప్రజల ముందుకు ఈ సమస్యను తీసుకెళ్లామని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇక సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. అక్టోబర్ నెలాఖరుకు వర్షాలు తగ్గుతాయని.. ఆ తర్వాత దెబ్బతిన్న రోడ్లపై నివేదిక రూపొందించి టెండర్లు పిలవాలని... మళ్లీ వర్షాకాలం మొదలయ్యేనాటికి రోడ్లన్నీ కొత్తరూపును సంతరించుకోవాలని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Janasena party, Pawan kalyan