ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీ అయిన వైసీపీ ప్లీనరీ (YCP Plenary-2022) ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఎర్పాటు చేసిన తీరు, సాధించిన విజయాలు, అమలు చేస్తున్న పథకాలు, పరిపాలన వంటివాటిపై ప్లీనరీలో పలు తీర్మానాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తోంది. జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. నవరత్నాలపై నవ సందేహాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అందులోని లోపాలతో పాటు ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గిస్తోందంటూ వివరణాత్మకంగా విమర్శించారు పవన్. రైతు భరోసా, అమ్మఒడి, పెన్షన్లు, మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
రైతు భరోసా పథకం కింద 64 లక్షల మందికి మేలు అని చెప్తున్న ప్రభుత్వం.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా? మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా? అని పవన్ ప్రశ్నించారు. అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2022
అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధమంటూ హామీ ఇచ్చి.. 2018-19లో రూ.14 వేల కోట్లు... 2021-22లో రూ.22 వేల కోట్లు – ఇదేనా మద్య నిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా? అని పవన్ నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టును ‘యుద్ద ప్రాతిపదిక’న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా? అని ప్రశ్నించిన పవన్.., ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సి.ఎమ్.ఆర్.ఎఫ్. నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రీ యింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? అని జనసేనాని ప్రశ్నించారు. పేదలందరికీ ఇళ్ళు అంటూ చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదో చెప్పాలన్నారు. పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి? అని నిలదీశారు పవన్. మరి పవన్ ప్రశ్నలకు వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ నేతలు సమాధానం చెబుతారో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan, Ysrcp