విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఒకరోజు దీక్షను జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విరమించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) కోసం పోరాడాల్సింది వైసీపీనేని ఆయన అన్నారు. ఎన్నికల కోసం స్టీల్ ప్లాంట్ నినాదం చేసిన వైసీపీ ఢిల్లీలో మాత్రం నోరెత్తడంలేదని విమర్శించారు. చేతగాని వాళ్లు మనకెందుకని ఎద్దేవ చేశారు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీనే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలన్నారు. వారికే ఆ ఆర్హత ఉందని పవన్ అన్నారు. వైసీపీ ముందుంటే వారితో పాటు తాను పోరాడాతనని స్పష్టం చేశారు. వైసీపీకి తాను అల్టిమేటం ఇవ్వలేదని.. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తాను ఎలా అల్టిమేటం ఇవ్వగలనని ప్రశ్నించారు. వైసీపీ రౌడీయుజాన్ని, దౌర్జన్యాలను, బూతులను ఇంకా రెండున్నరేళ్లు భరించక తప్పదన్న పవన్.. ప్రజలంతా వైసీపీకి ఓటు వేశారుగనుక స్టీల్ ప్లాంట్ అంశంపై వారినే నిలదీయాలని పవన్ పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ కోసం ఏపీలో ప్రంసగాలు, ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలు పార్లమెంట్ లో ఎందుకు నిలదీయడం లేదని పవన్ ప్రశ్నించారు. అధికార పార్టీగా ప్రజల సమస్యలను ఢిల్లీలో లేవనెత్తాల్సిన బాధ్యత వైసీపీ పైనే ఉందన్నారు. అప్పు ఉందని స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే.. రూ.6లక్షల కోట్లున్న ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా..? అని పవన్ ప్రశ్నించారు. 2014లో ఓట్లు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
2019లో ఓటు అనే చినుకును వైసీపీ అనే పెనం మీద వేస్తే ప్రజల జీవితాలు ఆవిరైపోయాయన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన అనే అలుచిప్పలో ఓట్లు వేయాలన్నారు. అప్పుడే అది ముత్యంలా మారి మెరుస్తుందని పవన్ అన్నారు. మంచి మనుషులు ఏ పార్టీలో ఉన్నా ఆదర్శంగా తీసుకుంటామన్నారు. వారసత్వ రాజకీయాలు పక్కనబెట్టిన మోదీ అంటే తనకు గౌరవమన్నారు.
రాయలసీమ నుంచి ఒక మహనీయుడు ముఖ్యమంత్రి అయితే ఆయనకే గుర్తింపునివ్వలేదని.. ఇక కర్నూలును రాజధాని అంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయని పార్టీ విశాఖ రాజధాని అంటే ఎలా నమ్మాలన్నారు. అమరావతి రాజధాని విషయంలో జనసేన పార్టీ వైఖరి మారదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మద్దతు పోతుందన్న భయంతో అమరావతి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. వైసీపీకి దళితుల ఓట్లు కావాలని గానీ.. దళిత సీఎం పేరిట స్మారక భవనం నిర్మాణానికి మాత్రం డబ్బులుండవన్నారు.
వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు జనసైనికులు భయపడే ప్రసక్తే లేదన్న పవన్ కల్యాణ్.. ఎన్ని అరాచకాలు చేసిన ధైర్యంగా నిలబడతామన్నారు. జనసేనపై చూపే ప్రతాపాన్ని కేంద్రంపై చూపాలని సూచించారు. ఎన్ని కష్టాలు వచ్చినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.