Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
తెలంగాణ (Telangana) మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ( Ex CS Somesh Kumar) బదిలీ వెనుక రాజకీయ కోణం ఉందా. ఐఏఎస్ ల కేటాయింపు 2015 లోనే పూర్తయినా సోమేష్ కుమార్ ఇన్నాళ్లు తెలంగాణ కేడర్ లో ఎలా కొనసాగారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని విస్తరించేందుకు కేసీఆర్ సోమేష్ కుమార్ సేవలు వాడుకుంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. సోమేష్ కుమార్ క్యాట్ లో రివ్యూ కోరే అవకాశం ఉన్నా, అలా కోరవద్దని కేసీఆర్ సోమేష్ కుమార్ ను వారించినట్టు తెలుస్తోంది. బీహార్ (Bihar) కు చెందిన సోమేష్ కుమార్ ను ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ఉపయోగించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ సీఎస్ ను తక్షణమే బదిలీ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ క్యాట్ నిర్ణయం తీసుకుంది. అక్కడ రివ్యూ కోరే అవకాశం ఉన్నా సోమేష్ కుమార్ అలా చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయ కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తరవాత 2014లోనే ప్రత్యూష్ సిన్హా కమిటీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపులు పూర్తి చేశారు. 1989 బ్యాచ్ కు చెందిన సోమేష్ కుమార్ ను డీఓపీటీ ఏపీకి కేటాయించింది. ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ క్యాట్ లో స్టే తీసుకువచ్చారు. క్యాట్ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని డీఓపీటీ 2017లో హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేసింది.
ఇదీ చదవండి : కోట్లలో కోడి పందాలు.. బరుల దగ్గర గోవా కల్చర్
ఏపీ, బీహార్ లో బీఆర్ఎస్ ను విస్తరించేందుకేనా?
కేంద్రంలోని బీజేపీతో వైరం పెంచుకున్న కేసీఆర్, జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సోమేష్ కుమార్ కేసులో తీర్పు రాగానే వెంటనే 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 1965, ఏపిల్ 7న కృష్ణా జిల్లాలో జన్మించిన శాంతికుమారి తెలంగాణ కేడర్ లో ఐఏఎస్ గా పనిచేస్తున్నారు. ఆమె పదవి స్వీకరించగానే ఏపీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆమెను కలవడం రాజకీయ చర్చకు దారితీసింది.
ఇదీ చదవండి : సీఎం ఇంట అంబరాన్నంటిన సంబరాలు.. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంక్రాంతి వేడుక
ఏపీలో కాపుల ఓట్లకు గాలం
కాపు సామాజిక వర్గానికి చెందిన శాంతికుమారిని సీఎస్ చేయడం ద్వారా ఏపీలో బీఆర్ఎస్ ద్వారా కాపుల ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది. దీని ద్వారా జగర్ రెడ్డికి పరోక్షంగా సాయం చేయాలని ఆయన భావిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.. సీఎస్ గా శాంతికుమారి పదవి చేపట్టగానే బీఆర్ఎస్ ఏపీ కాపు నేతలంతా ఆమెను కలవడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.
ఇదీ చదవండి : నారావారిపల్లిలో బాలయ్య సందడి.. జాగింగ్.. భోగి మంటలతో వీర సింహారెడ్డి హంగామా
సోమేష్ కుమార్ పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారు. క్యాట్ లో రివ్యూ పిటీషన్ వేసుకుంటే ఆయన్ని తెలంగాణలో కొనసాగనిచ్చే అవకాశం ఉండేది. కానీ సోమేష్ కుమార్ సేవలు బీఆర్ఎస్ విస్తరణకు వాడుకోవడంతోపాటు, కాపు సామాజిక వర్గానికి చెందిన శాంతి కుమారిని సీఎస్ చేయడం ద్వారా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ నిధులు పారించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లలో భారీ చీలక తెచ్చే వ్యూహాలు అమలు చేయడం ద్వారా కేసీఆర్, జగన్ రెడ్డిని మళ్లీ గెలిపించే ప్రణాళికలు అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, BRS, CM KCR, Somesh kumar