Anna Raghu, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త మంత్రివర్గం (AP New Cabinet) కొలుదీరడమేమో గానీ.. పదవి వచ్చిన వారి ఊరేగింపులు జం ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో చేపట్టిన విజయోత్సవర్యాలీలు.. స్థానికంగా రాజకీయ సందడి నెలకొనేలా చేస్తున్నా.. ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) లో కొత్త మంత్రిగారి ఊరేగింపులో పోలీసులు మరీ కర్కశంగా వ్యవహరించడంతో ఓ చిన్నారి నూరేళ్ల జీవితం బలైంది. వివరాల్లోకి వెళితే.. సత్య సాయి జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ (Minister Ushasri Charan) మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా కళ్యాణదుర్గం వచ్చారు. దీంతో ఆమెకు పార్టీ శ్రేణులుగు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. కళ్యాణదుర్గంలో మంత్రిగారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ ఈరక్క దంపతులు తమ చిన్నకుమార్తెకు ఆరోగ్యం బాలేక 108కు ఫోన్ చేశారు. అయినా రాకపోవడంతో బైక్ పై ఎక్కించుకొని ఆర్జీటీ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారు కళ్యాణదుర్గం చేరుకున్న తర్వాత పోలీసులు ట్రాఫిక్ నిలిపేశారు. ఐతే పాపను ఆస్పత్రికి తీసుకెళ్లానని.. వెళ్లేందుకు దారివ్వాలంటూ తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నా వినలేదు. అరగంటపాటు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది.
ఊరేగింపు వెళ్లిన తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారు. కాసేపటి ముందు తీసుకొచ్చిన పాపను బ్రతికించేవాళ్లమని చెప్పడంతో తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదించారు. మంత్రి ఊరేగింపు కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందంటూ పాప తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
మంత్రి ఊరేగింపు, పోలీసుల తీరుతో పాప ప్రాణాలు కోల్పోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ నేతల ఆర్భాటాలకు చిన్నారి ప్రాణాలు బలయ్యాయన్నారు. ఇది ముమ్మాటికి మంత్రి, పోలీసులు చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. ఆస్పత్రికి వెళ్తుంటే దారివ్వనివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన కోసం పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతుల ఏడాది చిన్నారి బలైంది. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యే.(1/2) pic.twitter.com/7fLQvjI0Bn
— Lokesh Nara (@naralokesh) April 15, 2022
ఈ ఘటనపై ఇటు మంత్రి ఉషశ్రీ చరణ్ గానీ, పోలీసులుగానీ స్పందించలేదు. మరోవైపు పోలీసుల తీరువల్ల పాప ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. అరగంట ముందు వచ్చి ఉంటే పాపను కాపాడేవాళ్లమని డాక్టర్లు చెప్పడం.. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్న పాప విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు మాత్రం తాము ఊరేగింపు బందోబస్తులో ఉన్నామని.. ఎవర్నీ అడ్డుకోలేదని చెబుతున్నారు. పాపకు అనారోగ్యంగా ఉందని చెబితే వెంటనే పంపించామన్ని సీఐ తేజోమూర్తి చెప్పారు. ఐతే పాప మేనమామ మాత్రం సకాలంలో 108 రాలేదని, పోలీసులు తమను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh