BJP Leader: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ముందస్తు తప్పదనే విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతలంతా వలసలపై ఫోకస్ చేస్తున్నారు. ఉన్న పార్టీలో గుర్తింపు లేకపోవడం.. లేదా వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టం అవుతుందనో కార కారణం ఏదైనా కొందరు ప్రస్తుతం ఉన్న పార్టీతో అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxmi Narayana) తీరు కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఆయన మౌనం కేడర్కు అర్థం కావడం లేదంటున్నారు. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు (Guntur) పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన వైసీపీ ఆహ్వానాన్ని కాదని.. బీజేపీలో చేరడం.. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ కావడం.. ఆయన నేతృత్వంలో 2019 ఎన్నికలకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి.
బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత కన్నా లక్ష్మినారాయణ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో కన్నా మౌనంపై కేడర్ కలత చెందుతున్నారు. కొద్ది రోజులుగా కన్నా లక్ష్మీ నారాయణను రాజ్యసభకు పంపుతారని.. అందుకే ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించారని అనుచరులు ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం ఎలాంటి పదవి దక్కలేదు. దానికి ప్రధాన కారణం ఏపీ బీజేపీ నేతలే అనే టాక్ ఉంది. ఇక ఎన్నికల లోపు ఏదో ఒక పదవి తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నారట.
ఒకవేళ రాజ్యసభ సీటు ఇవ్వకపోతే కన్నా ఏం చేస్తారు అనేది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గెలిస్తే ఏంటి? గెలవకపోతే ఏం జరుగుతుంది అనే లెక్కలతో కేడర్ కుస్తీ పడుతోందట. పల్నాడు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని కొందరి వాదన. తనకు అచ్చి వచ్చిన పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న లోక్సభ స్థానమైన నరసరావుపేట లేదా సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారని మరికొందరు చెబుతున్నారు. అయితే కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవర్గం అయితే కన్నా పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదీ చదవండి: ఒకేసారి సొంత ఇంటికోసం ఇద్దరు మాజీ సీఎం అడుగులు.. ఇద్దరి టార్గెట్ ఒక్కటే
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి నుంచే యాక్టివ్ కావాలని అనుచరులు కన్నాకు సూచిస్తున్నారట. త్వరగానే సెగ్మెంట్ ఎంపిక చేసుకుని క్షేత్రస్థాయి నుంచి పని మొదలు పెట్టకపోతే ఇబ్బందులు ఎదురు కావొచ్చని హెచ్చరిస్తున్నారట. గతంలో సీఎం పదవి వరకూ కన్నా పేరు చర్చల్లోకి వెళ్లిందని.. అలాంటి నాయకుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటకపోతే ఇమేజ్ కూడా ప్రమాదంలో పడుతుందని అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాను బీజేపీలో ప్రశాంతంగా ఉన్నానని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని.. బీజేపీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధంగా ఉన్నానని కేడర్కు బదులిస్తున్నారట కన్నా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Kanna Lakshmi Narayana