Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
BC Corporation: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ సారి రాజకీయాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలే ఈ సారి అధిక ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా.. ఈ సారి ఏ సమాజికి వర్గం ఏ పార్టీకి అంటూ లెక్కలు వేసుకుంటున్నాయి కూడా.. ఇందులో భాగంగా బీసీ ఓట్లే (BC Votes) టార్గెట్ గా.. అధికార వైసీపీ (YCP) ఇటీవల జయహో బీసీ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించింది.. ఆ సభ సక్సెస్ కూడా అయ్యింది. ఆ సభ సంగతి ఎలా ఉన్నా.. పార్టీ అధికారంలోకి వచ్చాక.. బీసీలకు ఏం చేసింది అన్నదాన్ని బట్టే.. ఆయా సామాజికవర్గం ఓట్లు పడతాయి అన్నది బహిరంగ రహస్యమే.. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వెనుక బడిన కులాల అభివృధ్ధే లక్ష్యంగా 2020 డిసెంబర్ 17 న బి.సి కార్పోరేషన్లను ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి కార్పోరేషన్ కు ఒక ఛైర్మన్ సహా 12 మంది డైరెక్టర్ల తో మొత్తం 136 కులాలకు గాను 56 కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది.
బి.సి కార్పోరేషన్లైతే ఏర్పాటు చేశారు కానీ వాటికి తగినన్ని నిధులు, విధులు ఏవీ లేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మెజారిటీ కార్పోరేషన్లకు కనీసం ఆఫీస్ కూడా లేదన్నది ప్రధాన ఆరోపణ.. ఛైర్మన్ డైరెక్టర్లకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి కూడా. పైగా ఛైర్మెన్ కి 56 వేలు, డైరెక్టర్లకి ఒక్కొక్కరికి 12 వేలు, ఛైర్మెన్ సహాయకులకి 12 వేలు వేతనం తో పాటు ఛైర్మన్ కు వాహన భత్యం కింద మరో 60 వేల చొప్పున ప్రతినెలా కోట్లాది రూపాయలు దుబారా చేశారనే విమర్శలూ లేకపోలేదు.
ఇంత ఖర్ఛు చేసి బి.సి కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వం బి.సి ల అభ్యున్నతికి చేసింది మాత్ర శూన్యమే అనే విమర్శలు ఉన్నాయి. కేవలం పార్టీ కోసం పని చేసిన తమ అనుయాయులకు పదవులు ఇచ్చుకోవడానికి మాత్రమే వైైసీపీ ప్రకటించిందని అభిప్రాయం చాలామందిలో ఉండేది. బి.సి కార్పోరేషన్లను కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిందనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి : జనసేనలో చేరుందుకు డేట్ ఫిక్స్ అయ్యిందా? కన్నా లెక్కలు ఏంటి? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?
అయితే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా..తాము భారీగా పదవులు ఇచ్చామనే మాటతప్ప ఫలానా కార్పోరేషన్ కి ఇన్ని నిధులు ఇచ్చాం, ఫలానా కులానికి అంత లబ్ధిచేకూర్చాం అనే వివరణ మాత్రం వైైసీపీ నేతల నుంచి కానీ.. అధికారుల నుంచి కానీ వినిపించలేదు. చాలా మంది కార్పోరేషన్ ఛైర్మెన్ లు, డైరెక్టర్లు తమ కార్పోరేషన్ ఆఫీసు కూడా ఎక్కడుందో తెలియకుండానే.. పదవీ కాలాన్నిముగించుకుంటున్నారు.
ఈ రెండేళ్ల కాలంలో నెలనెలా జీతం తీసుకోవడం తప్ప.. ఇప్పటికీ తమ విధులేంటో కూడా తమకు తెలియదని ఓ కుల కార్పోరేషన్ కు చెందిన డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. లెక్కకు మిక్కిలి పదవులు ఇస్తే సరిపోదని, ఆయా కార్పోరేషన్లకు నిధులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని కొందరు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకనైనా సభలు, సమావేశాలు, డిక్లరేషన్ల పేరుతో బి.సి లను మభ్యపెట్టడం మానుకొని బి.సి. ల నిజమైన అభ్యున్నతికి పాటుపడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ycp